సీఎం కేసీఆర్(CM KCR) మండల స్థాయి నాయకుడిగా దిగజారి పోయారని హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్(Etela Rajender) పేర్కొన్నారు. కేసీఆర్ ఏనాడైనా అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేశారా అని ప్రశ్నించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కేసీఆర్ దళితులపై ఎనలేని ప్రేమ ఒలకబోస్తున్నారని వాపోయారు. దళితబంధు పేరుతో మాయ చేయడానికి వెనుకాడడం లేదన్నారు. దళితబంధుకు రూ.500 కోట్లు కేటాయించిన ప్రభుత్వం కేవలం 15 మందికి మాత్రమే లబ్ధిదారులను గుర్తించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
ఇన్నాళ్లు సెక్రటేరియట్ లో దళితులు అధికారులుగా ఉండేవారు కాదని చెప్పారు. కేవలం నేను విమర్శించిన తరువాతే అక్కడ దళితులను అపాయింట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో సీఎస్ గా పనిచేసిన ప్రవీణ్ చంద్ర లాంటి వారి ఉద్యోగ విరమణకు కూడా వెళ్లని సీఎం వారిపై కావాలనే ప్రేమ నటిస్తున్నారని అన్నారు. మరో ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ పై కూడా లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఎన్నిగ్రామాలు తిరిగినా అధికార పార్టీకి కనీసం డిపాజిట్ కూడా రాదని పేర్కొన్నారు.
సీఎం పేషీలో బీసీ, ఎస్టీ, మైనార్టీ అధికారులను కూడా నియమించాలని అన్నారు. ఎస్సీ వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారిని నియమించారని పేర్కొన్నారు. వాసాలమర్రిలో ఇచ్చిన డబ్బులు ఇంతవరకు లబ్ధిదారుల ఖాతాల్లో పడలేదని చెప్పారు. హుజురాబాద్ లో ఫరిస్థితి ఇలాగే ఉంటుందని అన్నారు. తెలంగాణలో పరిస్థితి మారిపోయిందని గుర్తు చేశారు.
సామాజిక మాధ్యమాల్లో అనవసర పోస్టులు పెట్టే వారి చేత పోస్టర్లు వేయించడం మానుకోవలని హితవు పలికారు. సీఎం కేసీఆర్ సోషల్ మీడియా వేదికగా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. లేనిపోని వాటిని నెట్ లో పెట్టిస్తూ లబ్ధిపొందాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. చిల్లర రాజకీయాలు చేస్తే ప్రజలు తగిన బుద్ది చెబుతారని చెప్పారు. ధనం ఎంత కుమ్మరించినా తనదే చివరికి గెలుపు అని దీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ ఇంత దిగజారి పోవడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందని పేర్కొన్నారు.