ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో.. అక్కడి ప్రజలు ఎంతగా భీతిల్లిపోతున్నారో తెలిసిందే. కఠినమైన షరియా చట్టాలు అమలు చేస్తూ.. మంచినీళ్లు తాగినంత సులువుగా హత్యలు చేసే నరరూప రాక్షలను తలుచుకుంటూ ఆఫ్ఘన్లు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పారిపోయేందుకు చూస్తున్నారు. ఈ క్రమంలో.. దేశం విడిచిపోయేందుకు అమెరికా విమానం రెక్కల మీద ప్రయాణించి, ముగ్గురు జారిపడిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో పెను సంచలనం రేకెత్తించింది. అయితే.. అలా కిందపడిపోయిన వారిలో ఇద్దరు అన్నదమ్ములుగా తేలినట్టు సమాచారం.
విమానం రెక్కల పైనుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయిన అన్నదమ్ముల్లో ఒకరి వయసు 17 సంవత్సరాలు కాగా.. మరొకరి వయసు 16 ఏళ్లు మాత్రమే. ఇంకా ఎంతో భవిష్యత్ ఉన్న ఈ సోదరులిద్దరూ దుర్మరణం పాలవడం అందరినీ కలచి వేసింది. వీరిలో అన్న శవం లభించినప్పటికీ.. తమ్ముడు మృతదేహం ఇప్పటి వరకూ లభించలేదట. పెద్దవాడి మృతదేహం నుజ్జునుజ్జైన రీతినలో దొరికింది. అతని మృతదేహాన్ని ఖననం చేసిన కుటుంబీకులు.. చిన్నవాడి కోసం గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. మొత్తం ఎనిమిది మంది సంతానం ఉన్న ఆ ఇంట్లో వీరిద్దరే పెద్దవారుగా తేలింది.
తాలిబన్ల పాలన ఏ విధంగా ఉంటుందో ప్రతీ ఆఫ్ఘన్ పౌరుడీకి తెలిసిందే. దీంతో.. వారు రాజధానిని ఆక్రమించుకుందన్న వార్త తెలిసిన మరుక్షణమే.. దేశం వదిలి పారిపోయేందుకు వేలాది మంది ప్రయత్నించారు. వారిలో ఈ ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. ఈ సమయంలో కెనడా, అమెరికాలో 20 వేల మంది ఆఫ్ఘన్లకు ఆశ్రయం ఇస్తున్నట్టు ఎవరో అనుకుంటుండగా వీరిద్దరూ విన్నారట.
ఆ వెంటనే తమ గుర్తింపు కార్డులు తీసుకొని ఎయిర్ పోర్టుకు పరుగులు తీశారు. అక్కడికి వెళ్లి చూస్తే.. విమానం పూర్తిగా నిండిపోయి ఉండడం.. దాని రెక్కల పైన కూడా ఎక్కి ప్రయాణించేందుకు అందరూ ప్రయత్నిస్తుండడంతో.. వీళ్లు కూడా ఎక్కేశారు. చివరకు విమానం గాళ్లోకి లేసిన వెంటనే నేల రాలిపోయారు.