Homeఆంధ్రప్రదేశ్‌ఆదిత్యనాథ్ వ్యవహారంపై టీడీపీ ఫిర్యాదు?

ఆదిత్యనాథ్ వ్యవహారంపై టీడీపీ ఫిర్యాదు?

TDP MPఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ టాపిక్ హాట్ గా మారింది. ఆయన పదవీ కాలం పొడిగింపు రాజకీయం అవుతోంది. ఆయన వ్యవహారం వివాదాలకు కేంద్ర బిందువవుతోంది. ఆదిత్యనాథ్ పదవీ కాలాన్ని ఆరు నెలల పాటు పెంచాలని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఆయన పదవీ కాలాన్ని పొడిగించొద్దని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ డీవోపీటీకి లేఖ రాశారు.

అందులో ఆదిత్యనాథ్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల గురించి ప్రస్తావించారు. జగన్ కేసులో నిందితుడిగా ఉన్న ఆయన పలు కేసుల్లో లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. ఇండియా సిమెంట్స్ సంస్థకు సీఎస్ మరింత మేలు చేశారని గుర్తు చేశారు. సంబంధిత ఆధారాలు లేఖకు జత చేశారు.

సీఎస్ గా ఆదిత్యనాథ్ ను కొనసాగిస్తే ఇబ్బందులొస్తాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యానికే ప్రమాదమని తెలిపారు. ఇప్పుడు డీవోపీటీకి ఫిర్యాదు అందడంతో కేంద్రం ఆదిత్యనాథ్ పదవీ కాలం పొడిగించాలా ? వద్దా అన్న సందేహంలో పడిపోయింది. కేంద్ర ప్రభుత్వం అనుకూలిస్తే పొడిగింపు సులభమే అని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. చంద్రబాబు హయాంలో ఇలాంటి పొడిగింపులు ఎవరికి ఇవ్వలేదు.

అయితే ఇటీవల కరోనా కారణంగా కీలక అధికారులు మధ్యలో రిటైరైతే పదవీ కాలం పెంచడం సర్వసాధారణంగా మారిపోయిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ర్టాల కోరిక మేరకు పదవీ కాలాన్ని పొడిగించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎస్ ల పదవీ కాలం పొడిగింపు అనేది ప్రభుత్వాలకు సంబంధించినదే. ప్రతిపక్షాలు ఫిర్యాదు చేసేది తక్కువే. ఏపీలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. డీవోపీటీకి బెంగాల్ సీఎస్ పదవీ కాలం పొడిగింపు వ్యవహారం ఇబ్బందికరంగా మారింది. ఇప్పుడు ఏపీ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందోనని ఆసక్తి కలుగుతోంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version