Ganta Srinivasa Rao- Janasena: టీడీపీతో అంటీ ముట్టనట్టుగా ఉన్న విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రూటు మార్చారు. జనసేనకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అటు ఆయన వ్యవహార శైలి కూడా అలానే ఉంది. గడిచిన ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనలో కూడా ఆయన టీడీపీ తరుపున గెలుపొందారు. కానీ వ్యాపారాలు, ఇతరత్రా ఇబ్బందులు వస్తాయని అనుకున్నారో.. లేక అధికార పార్టీ నుంచి బెదిరింపులు వచ్చాయో ఏమో కానీ.. టీడీపీకి దూరంగా ఉన్నారు. ఆ మధ్యన పార్టీ కార్యాలయంలో చటుక్కున మెరిసినా.. అదే స్పీడులో మాయమైపోయారు. ఇప్పుడు మెగా జపం పఠిస్తున్నారు. జనసేనకు దగ్గరయ్యేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.

అయితే గంటాపై రకరకాల కథనాలు వచ్చాయి. ఎన్నికల అనంతరం ఆయన వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి, నాటి మంత్రి అవంతి శ్రీనివాస్ అడ్డుకట్ట వేశారని టాక్ నడిచింది. తరువాత అదిగో ఇదిగో అంటూ ముహూర్తాలు సైతం వెలువడ్డాయి. కానీ అవన్నీ ఉత్తమాటేనని తేలిపోయాయి. తరువాత బీజేపీలోకి వెళతారని ప్రచారం జరిగింది. కానీ కమలం గూటికి కూడా వెళ్లలేదు. అయితే ఇప్పుడు జనసేన గ్రాఫ్ పెరిగిందని తెలియడంతో ప్రజారాజ్యం పార్టీ పూర్వనేత రూటు మార్చారు. తన పూర్వ సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకుంటూ పవన్ కు దగ్గరవ్వాలని చూస్తున్నారు.

ఇటీవల చిరంజీవిని గంటా కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నాడు పీఆర్పీలో చిరంజీవి వెన్నంటి నడిచిన నాయకుల్లో గంటా ముందుంటారు. పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేసే సమయంలో చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి, గంటాకు రాష్ట్ర మంత్రి పదవి దక్కింది. కానీ అనూహ్య పరిణామాలతో గంటా టీడీపీలో చేరారు. కానీ వారి మధ్య సన్నిహిత సంబంధాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గాడ్ ఫాదర్ సక్సెస్ అయినందుకు చిరును అభినందించడానికి ప్రత్యేకంగా కలిశారు. తాను పవన్ తో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నట్టు గంటా చిరంజీవితో చెప్పినట్టు సమాచారం. అయితే అన్నీ కుదిరితే గంటా త్వరలో జనసేన కండువా వేసుకోవడం ఖాయంగా తెలుస్తోంది.