Chandrababu-BJP: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు.. పదవి, అదికారం కోసం మిత్రులను పక్కన పెడతారు. శత్రువులను చేరదీస్తారు. ఇదే సమయంలో శత్రువుకు శత్రువు మిత్రుడు.. అనే ఫార్ములాను రాజకీకంగా తమ అవసరానికి అనుగుణంగా వాడుకుంటారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పుపడు ఇదే ఫార్ములాను తెలంగాణలో అమలు చేయాలని చూస్తున్నారు. తెలంగాణ ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీకి తాను దగ్గర కావాలనుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీతో యుద్ధం చేస్తున్నారు. గతంలో ఓటుకు నోటు కేసు తెరపైకి తెచ్చి తెలంగాణ నుంచి బాబును ఆంధ్రాకు తరిమేశాడు కేసీఆర్. ఈ నేపథ్యంలో కేసీఆర్ను ఉమ్మడి శత్రువుగా చూపి… బీజేపీతో మైత్రి చేయాలనుకుంటున్నారు. తెలంగాణలో సరైన క్యాడర్ లేని బీజేపీని అధికారంలోకి తేవడానికి సహకరించి.. ఆంధ్రాలో మళ్లీ తాను అధికారంలోకి రావాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే ఖమ్మలో బాబు బలప్రదర్శన చేశారన్న అభిప్రాయం రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యక్తమవుతోంది.

తెలంగాణ బీజేపీలో రెండు వర్గాలు…
గతంలో తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు టీడీపీని పూర్తిగా యాక్టివ్ చేయించి పొత్తులు పెట్టుకోవాలని అధిష్టానానికి సూచించారు. అయితే మరోవర్గం నేతలు టీడీపీతో పొత్తును ఇష్టపడలేదు. మరోవైపు చంద్రబాబునాయుడికి బీజేïతో పొత్తు పెట్టుకోవడం అవసరం. రానున్న ఏపీ ఎన్నికల్లో వైఎస్.జగన్ను ఎదుర్కోవడం అంత సులభం కాదని బాబుకు తెలుసు. కేంద్రం నుంచి సహకారం ఉంటేనే ఎదుర్కోగలుగుతామని ఆయన భావిస్తున్నారు. ఇంకోవైపు జనసేనాని పవన్ కల్యాణ్ కూడా టీడీపీతో పొత్తు కోసం ఎదురు చూస్తున్నారు.
క్యాడర్ బలం చూపిన బాబు…
తెలంగాణలో చంద్రబాబు బలాన్ని నరేంద్రమోదీ, అమిత్షా వద్ద తక్కువ చేసి చూపించిన వర్గానికి మింగుడు పడని రీతిలో ఖమ్మంలో సభ నిర్వహించామని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ఒకరకంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అనుకూలవర్గంగా ఉన్న బీజేపీ నేతలు కూడా దీనిపై సంతోషంగా ఉన్నారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన బహిరంగసభకు ప్రజలు పోటెత్తారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు చంద్రబాబు ర్యాలీగా వెళుతుంటే తెలంగాణ ప్రజలు ఆశ్చర్యపోయారు. గులాబీ నేతల గుండెల్లో గుబులు మొదలైంది. బాబు సభపై మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, ప్రశాంత్రెడ్డితోపాటు ఎమ్మెల్సీ, కేసీఆర్ తనయ కవిత స్పందించడమే ఇందుకు నిదర్శనం.

బీజేపీ కోర్టులో బంతి?
ఖమ్మం సభ విజయవంతం కావడంతో చంద్రబాబు తాను అనుకున్న లక్ష్యం చేరారు. ప్రస్తుతం ఈ విషయం బీజేపీ ఢిల్లీ పెద్దలకు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబుతో కలిసి పనిచేసేలా పార్టీ అధిష్టానంలో కదలిక తీసుకురాగలిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో ఏ క్షణంలోనైనా ముందస్తు ఎన్నికలు జరగొచ్చని భావిస్తున్నారు. బీజేపీకి నాయకుల బలం లేకపోవడంతో ముందస్తు ఎన్నికలతో మరోసారి అధికారంలోకి రావచ్చని బీఆÆŠఎస్ వ్యూహంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ కుమ్ములాలు మాని ఎన్నికలపై దృష్టిపెట్టే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ బలం రోజురోజుకు తగ్గుతోందని అంచనా వేస్తున్న బీజేపీ తెలంగాణలో అధికారం కోసం ఎదురు చూస్తోంది. సింగిల్గా వెళితే అధికారం దక్కుతుందన్న నమ్మకం లేదు. ఏదో ఒక ఆసరా అవసరమవుతోంది. ఆ ఆసరాను తాను ఇస్తానంటోంది టీడీపీ. ఈ తరహాలో చంద్రబాబు తెలంగాణ రాజకీయంపై దృష్టిసారిస్తారని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలెవరూ ఊహించలేదు. కానీ చంద్రబాబు తాజా సభ తర్వాత తెలంగాణలో రాజకీయం మొత్తం మారిపోయింది. ఇప్పుడు బంతి బీజేపీ కోర్టులోకి చేరింది. దీనిపై మోదీ–షా ద్వయం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఉండటంతో ఏం తేలుస్తుందో చూడాలి.