అప్ఘానిస్తాన్ తాలిబన్ల వశమైంది. తాలిబన్లు గద్దెనెక్కగానే ప్రజలందరికీ క్షమాభిక్ష ప్రవేశపెట్టామని.. ఎవరూ భయపడవద్దని అభయమిచ్చారు. మహిళలకు స్వేచ్ఛనిస్తున్నట్టు ప్రకటించారు. అయితే అది కేవలం కంటితుడుపు చర్య అని అర్థమైంది. హామీ ఇచ్చి 24 గంటలు కూడా కాకముందే నిరసన తెలిపిన అప్ఘనిస్తాన్ ప్రజలపై కాల్పులు జరిపారు. తాలిబన్ల పాలన ఎలా ఉంటుందో రుచిచూపించారు. దీంతో ప్రజలంతా కన్నీళ్లు కారుస్తున్నారు. ఈ ఘోరం చూసి ప్రపంచదేశాలు షాక్ కు గురవుతున్నాయి.
ప్రభుత్వ కార్యాలయాలపై అప్ఘన్ జాతీయ జెండాను ఉంచాలని డిమాండ్ చేస్తూ ఆ దేశ ప్రజాస్వామ్య జాతీయ జెండాతో నిరసన తెలిపిన ప్రజలపై తాజాగా తాలిబన్లు కాల్పులు జరిపి చంపడం కలకలం రేపింది. జలాలబాద్ లో బుధవారం ఈ ఘటన జరిగింది.
ప్రభుత్వ కార్యాలయాలపై తాలిబన్ల జెండా బదులు అప్ఘనిస్తాన్ జెండాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ జలాలబాద్ లో కొందరు ప్రజలు బుధవారం భారీ ర్యాలీ తీశారు. అప్ఘన్ జెండాతో నిరసన తెలిపారు.
ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న తాలిబన్లు నిరసన కారులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. నిరసనను చిత్రీకరిస్తున్న జర్నలిస్టులను కూడా కొట్టారు. ఈ ఘటనలో పలువురు అక్కడిక్కడే చనిపోగా.. జనం పరుగులు తీశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#Taliban firing on protesters in Jalalabad city and beaten some video journalists. #Afghanidtan pic.twitter.com/AbM2JHg9I2
— Pajhwok Afghan News (@pajhwok) August 18, 2021