ఏపీలో బీజేపీ–జనసేన పొత్తు పొడిచింది. ఇరు పార్టీలు జతకలిసి ఆరు నెలలు పైగానే అవుతోంది. అప్పటి నుంచి ఆ పార్టీలు కలిసి పనిచేసిన దాఖలాలు లేవు. పొత్తు ప్రకటించాక కరోనా వైరస్ రావడంతో పవన్ కల్యాణ్ హైదరాబాద్కు పరిమితం అయ్యాడు. బీజేపీకి కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన సోము వీర్రాజు సైతం హైదరాబాద్ వెళ్లి పవన్ను కలిసి వచ్చారు.
Also Read: సైలెంట్గా సైడ్ అయిపోయిన నారాయణ.. ఏమైంది?
పొత్తు సందర్భంలో పవన్ కల్యాణ్ కూడా ఓ విషయాన్ని స్పష్టం చేశాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇరుపార్టీలు కలిసి పోటీ చేస్తాయని చెప్పుకొచ్చాడు. కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా లేదు. అసలు ఎప్పుడు జరుగుతాయో కూడా తెలియదు. కరోనా తగ్గిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక ముందు రానుంది.
ఈ నేపథ్యంలో తిరుపతి బరిలో నిలిచేందుకు బీజేపీ ఆల్రెడీ సై అంటోంది. అయితే.. ఈ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీచేస్తే వాటికి ఇవే ఫస్ట్ ఎలక్షన్స్ అని చెప్పాలి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలపై దాడులు జరగడం, తిరుమలలో ముఖ్యమంత్రి జగన్ డిక్లరేషన్ వివాదం వంటివి తమకు కలిసి వస్తాయని బీజేపీ గట్టిగా నమ్ముతోంది. నిజానికి తిరుపతి ప్రాంతంలో బీజేపీ కన్నా జనసేన బలంగా ఉంది. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ జనసేనకే కొద్దోగొప్పో క్యాడర్, ఓటు బ్యాంకు ఉంది.
Also Read: పగబట్టినట్లే వానలు.. ఎందుకిలా?
మరోవైపు ఈ ఉప ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థినే బరిలోకి దింపాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారని తెలిసింది. ఉప ఎన్నిక పార్లమెంటుకు సంబంధించింది కాబట్టి తమకు బలం ఉన్నా బీజేపీ అభ్యర్థికే వదిలేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం. రెండు పార్టీలూ కలిసి పోటీ చేయాలని, బీజేపీ నుంచి బలమైన అభ్యర్థిని ఎంపిక చేయాలని కూడా పవన్ కల్యాణ్ ఆ పార్టీ నేతలకు సూచించినట్లు తెలిసింది. మొత్తమ్మీద తిరుపతి సీటును ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని ఈ ఇరు పార్టీలు నిర్ణయానికి వచ్చినట్లుగా అర్థమవుతోంది.