Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu: చంద్రబాబుపై అభిమానం.. తెస్తున్న ప్రమాదం..

Chandrababu: చంద్రబాబుపై అభిమానం.. తెస్తున్న ప్రమాదం..

Chandrababu: “చంద్రబాబు అరెస్టు విషయంలో అర్జెంటుగా కేంద్రం కల్పించుకోవాలి. జగన్ను నియంత్రించాలి. అవసరమైతే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి”.. ఏపీలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కోరుతున్నది ఇదే. చంద్రబాబు రిమాండ్ ఖైదీగా మారి 15 రోజులు అవుతున్న క్రమంలో కేంద్ర పెద్దలు ఎవరు స్పందించడం లేదు. ఇటు చంద్రబాబుకు జైలు నుంచి విముక్తి కావడం లేదు. ఈ తరుణంలో టిడిపి శ్రేణులు ఫ్రస్టేషన్లోకి వెళ్తున్నాయి. కేంద్ర పెద్దల తీరుపై విమర్శలు చేస్తున్నాయి. దీంతో అది అసలుకి ఎసరు పెట్టేలా ఉంది.

గతంలో తనపై అవినీతి కేసులు మోపడానికి చంద్రబాబు ప్రధాన కారణం అన్నది జగన్ అనుమానం. దీంతో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే చంద్రబాబును జగన్ వెంటాడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే జగన్ వర్సెస్ చంద్రబాబు అన్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబును జగన్ ఇరికించగలిగారు. జైలులో పెట్టేంచగలిగారు. ఇటువంటి తరుణంలో చంద్రబాబుపై ఒక రకమైన సానుభూతి వ్యక్తం అవుతోంది. దానిని పెంచుకోవాల్సిన క్రమంలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తప్పుల మీద తప్పులు చేస్తోంది. ప్రధాని మోదీ, అమిత్ షా ఎందుకు కలుగజేసుకోరని? వారి ప్రమేయం సైతం ఉందన్న అనుమానాలు వచ్చేలా పోస్టులు పెడుతున్నారు. అంతటితో ఆగకుండా ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

జగన్ సిబిఐ కేసుల్లో 16 నెలలపాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు రిమాండ్ ఖైదీగా 15 రోజులు పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇప్పుడు పోరాటం చంద్రబాబు, జగన్ల మధ్య సాగుతోంది. తేల్చుకోవాల్సింది కూడా ఆ ఇద్దరే. ఇప్పటికే చంద్రబాబుకు జనసేన, వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏకు సారథ్యం వహిస్తున్న బిజెపి పెద్దలు న్యూట్రల్ గా ఉన్నారు. కొద్ది రోజుల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తుల ప్రకటన చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో చంద్రబాబు కేసుల్లో కేంద్ర పెద్దల ప్రమేయం ఉందని టిడిపి సోషల్ మీడియా ప్రచారం చేస్తుండడం ఇబ్బందికరంగా మారుతోంది.

గత ఎన్నికల ముందు సైతం తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మక తప్పటడుగులు వేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని దూరం చేసుకుంది. జగన్ తో చేయాల్సిన పోరాటం విషయంలో మధ్యలో బిజెపి ప్రమేయాన్ని తీసుకువచ్చింది. ముఖ్యంగా జగన్ ట్రాప్ లో పడింది. దానికి ఇప్పటివరకు చెల్లించిన మూల్యం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి అటువంటి తప్పిదానికి పాల్పడితే మాత్రం మూల్యం చెల్లించుకునేది తెలుగుదేశం పార్టీయే. అటు బిజెపి శ్రేణులు సైతం చంద్రబాబు అరెస్టుపై ఇప్పుడిప్పుడే సానుకూలంగా స్పందిస్తున్నాయి. 73 సంవత్సరాల వయసులో చంద్రబాబును ఇబ్బంది పెట్టడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.ఇటువంటి తరుణంలో బిజెపిపై కానీ.. కేంద్ర పెద్దలపై కానీ తప్పుడు ప్రచారం చేస్తే.. ముమ్మాటికి అది తెలుగుదేశం పార్టీకి మైనస్ గా మారనుంది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular