రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ రోజురోజుకూ పెరుగుతోందని.. ఆ అలజడి వైసీపీ నేతల్లో కనిపిస్తోందని సోము వీర్రాజు అన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో ఓటర్లు వైసీపీకి బుద్ధి చెప్పడం ఖాయమని జోస్యం చెప్పారు. అంతేకాదు..ఈ ఎన్నికలో బీజేపీ–జనసేన కూటమినే ఘన విజయం సాధిస్తోందని చెప్పారు. అదేసమయంలో ప్రభుత్వం లొసుగులను సైతం ప్రజల ముందుంచే ప్రయత్నం చేశారు సోము వీర్రాజు. జగన్ వలంటీర్లను అడ్డుపెట్టుకొని ఎన్నికల్లో గెలుపొందాలని చూస్తున్నారని అన్నారు. అంతేకాదు.. రాష్ట్రం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులనే వాడుతున్నారని చెప్పారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న చాలా పథకాల్లో కేంద్రం వాటా ఉందని.. జగన్ కొత్తగా చేస్తున్నదేమీ లేదని సోము దుయ్యబట్టారు. దీనిపై అవసరమైతే చర్చకైనా సిద్ధమని సవాల్ విసిరారు. కేంద్రం ఇచ్చిన కోట్లాది రూపాయలను ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఈ విషయాలన్నీ అర్థమై బీజేపీ వైపు మళ్లుతున్నారని.. ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి వైసీపీకి నిద్రపట్టడం లేదని విమర్శించారు. క్రైస్తవులు అంటే తమకేం కోపం లేదని.. క్రైస్తవులకు తమ పార్టీ వ్యతిరేకం కాదని.. కానీ.. కొంత మంది వైసీపీ నేతలు మాత్రం చర్చి ప్రార్థనల్లో పాల్గొంటున్నారని ఆరోపించారు. స్వారి వారి నామాలు పెట్టుకున్న వారి పట్ల వైసీపీ నేతలు హేళనగా మాట్లాడడం కూడా సరికాదన్నారు.
ఈనెల 17న తిరుపతి ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ తిరుపతి బహిరంగ సభ నిర్వహించాలని ముందుగా అనుకున్నారు. కానీ.. కోవిడ్ కారణంగా ఆ ఆలోచనను విరమించుకున్నారు. అటు పవన్ కల్యాణ్ కూడా క్వారంటైన్లోకి వెళ్లిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇక బీజేపీ కూడా తన దూకుడును ఎక్కడా ఆపడం లేదు. పవన్ కల్యాణ్ క్వారంటైన్లోకి వెళ్లిపోయినా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రచార బాధ్యతలను తన భుజాన వేసుకొని అంతా తానై నడిపిస్తున్నారు. ఎక్కడా కార్యకర్తల్లోనూ మనోస్థైర్యం కోల్పోకుండా ధైర్యం నింపుతూనే ఉన్నారు. ఓటర్లను కలుస్తూ బీజేపీకి ఓటు వేయాల్సిన ఆవశ్యకతపై వివరిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను వారికి వివరిస్తున్నారు.