ట్రంప్‌ దిగిపోక తప్పదా..? : వేటు వేసేందుకు కేబినెట్‌ సిద్ధం

డోనాల్డ్‌ ట్రంప్‌ మరికొద్ది రోజుల్లో అధికార పీఠాన్ని వీడబోతున్నారు. ఇటీవల ఓటమిని తట్టుకోలేక ఆయన వైఖరి అందరినీ గందరగోళానికి గురిచేస్తోంది. చివరి రోజుల్లో విపరీత చర్యలకు పాల్పడుతూ భంగపాటుకు గురవుతున్నారు. తాజాగా.. అమెరికా క్యాపిటల్‌ భవనంపై ట్రంప్‌ మద్దతుదారుల దాడి ప్రజాస్వామ్యానికే మాయని మచ్చలా మారింది. ఈ ఘటనతో అటు డెమొక్రాట్లతోపాటు సొంత పార్టీలోని నేతల నుంచి కూడా ట్రంప్‌పై వ్యతిరేకత వస్తోంది. అందుకే.. ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని ట్రంప్‌ కేబినెట్‌ భావిస్తున్నట్లు సమాచారం. […]

Written By: Srinivas, Updated On : January 7, 2021 2:53 pm
Follow us on


డోనాల్డ్‌ ట్రంప్‌ మరికొద్ది రోజుల్లో అధికార పీఠాన్ని వీడబోతున్నారు. ఇటీవల ఓటమిని తట్టుకోలేక ఆయన వైఖరి అందరినీ గందరగోళానికి గురిచేస్తోంది. చివరి రోజుల్లో విపరీత చర్యలకు పాల్పడుతూ భంగపాటుకు గురవుతున్నారు. తాజాగా.. అమెరికా క్యాపిటల్‌ భవనంపై ట్రంప్‌ మద్దతుదారుల దాడి ప్రజాస్వామ్యానికే మాయని మచ్చలా మారింది. ఈ ఘటనతో అటు డెమొక్రాట్లతోపాటు సొంత పార్టీలోని నేతల నుంచి కూడా ట్రంప్‌పై వ్యతిరేకత వస్తోంది. అందుకే.. ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని ట్రంప్‌ కేబినెట్‌ భావిస్తున్నట్లు సమాచారం.

Also Read: వాషింగ్టన్‌లో ఎమర్జెన్సీ..: మారణాయుధాలతో ట్రంప్‌ మద్దతుదారుల ఆందోళన

ట్రంప్‌ వైఖరితో ఆయనపై వేటు పడే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే.. అధ్యక్ష పదవి నుంచి తొలగించేందుకు రెండు మార్గాలను అనుసరించాల్సి ఉంటుంది. ఒకటి అభిశంసన తీర్మానం.. రెండో అమెరికా రాజ్యంగంలోని 25వ సవరణ అధికారం. ఈ రెండింటిలో ఏ ప్రక్రియ ఓకే అయినా.. కొత్త అధ్యక్షుడు బాధ్యతలు తీసుకునే వరకూ ఉపాధ్యక్షుడే అధ్యక్ష హోదాలో కొనసాగుతారు. అందుకే.. ఇప్పుడు 25వ సవరణ అధికారంపై కేబినెట్‌ సభ్యులు చర్చిస్తున్నట్లు సమాచారం.

కొత్త ప్రెసిడెంట్‌ జోబైడెన్‌ పదవీ బాధ్యతలు స్వీకరించడానికి ఇంకా 13 రోజుల సమయం ఉంది. అంటే జనవరి 20న అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే.. ఇంతవరకు అధికార బదలాయింపునకు ట్రంప్‌ ససేమిరా అంటున్నారు. బైడెన్‌ గెలుపును అడ్డుకునేందుకు చివరి నిమిషం వరకూ తన కుటిల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ట్రంప్‌. ఇలాంటి సమయంలో క్యాపిటల్‌ భవనంపై ట్రంప్‌ మద్దతుదారులు దాడి చేయడంతో ఆయనపై వ్యతిరేకత తారాస్థాయికి చేరింది. దీంతో జనవరి 20కి ముందే ఆయనను పదవి నుంచి తొలగించాలని యూఎస్‌ కేబినెట్‌ మంతనాలు జరుపుతోంది. అదే జరిగితే ట్రంప్‌నకు అవమాన భారం తప్పదు.

Also Read: ట్రంప్ అమెరికా ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ

నిజానికి ట్రంప్‌పై గతంలోనూ అభిసంసన తీర్మానం తీసుకొచ్చారు. 2019లో ట్రంప్‌పై ప్రతినిధుల సభలో ఈ తీర్మానం చేశారు. జో బైడెన్‌, ఆయన కుమారుడు హంటర్‌‌పై దర్యాప్తు జరపాలంటూ ఉక్రెయిన్‌పై ఒత్తిడి తెచ్చారంటూ దిగువ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. డెమొక్రాట్ల బలం ఎక్కువగా ఉండడంతో అక్కడ అభిశంసన నెగ్గింది. అయితే.. 2020 ఫిబ్రవరిలో రిపబ్లికన్లకు ఆధిపత్యం ఉన్న సెనెట్‌లో ట్రంప్‌ నిర్దోషిగా తేలడంతో అభిశంసన వీగిపోయింది.

మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు