Homeఆంధ్రప్రదేశ్‌ఏపీలో విగ్రహాల ధ్వంసం వెనుక పెద్ద స్కెచ్?

ఏపీలో విగ్రహాల ధ్వంసం వెనుక పెద్ద స్కెచ్?

Chandrababu Jagan

కనీవినీ ఎరుగని రాజకీయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నడుస్తోంది. వరుసగా దేవతా విగ్రహాలు ధ్వంసం అవుతుండడం వెనుక రాజకీయ కుట్ర ఉందనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. కానీ.. ఎవరు చేస్తున్నారు? అన్నదే అసలైన ప్రశ్న. విపక్షాలు మూకుమ్మడిగా ప్రభుత్వం వైపే వేలెత్తి చూపిస్తున్నాయి. జగన్ సర్కారుకు మతం రంగు పులిమే ప్రయత్నం ముమ్మరంగా సాగుతోంది. కానీ.. ఇందులో వాస్తవానికి అవకాశమే లేదన్నది మెజారిటీ అభిప్రాయం. తాను అధికారంలో ఉన్నప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా ఇలాంటి చర్యలకు పాల్పడతాడా? ప్రభుత్వానికి మచ్చ తెచ్చే ఇలాంటి పనులకు పూనుకుంటాడా? అల్లర్లకు అవకాశమిచ్చే విధానాలకు సిద్ధపడతాడా? అంటే.. కనీస పరిజ్ఞానం ఉన్న ఎవ్వరైనా ‘లేదు’ అనే అంటారు. ఇప్పుడు ఏపీలో జరుగుతున్న విగ్రహాల ధ్వంసంపైనా ప్రజలు ఇదే అభిప్రాయంతో ఉన్నారు. మరి, ఇప్పుడు దోషులు ఎవరు? అన్నదే తేలాల్సింది.

Also Read: స్థానిక సంస్థల కోసం వైసీపీ భారీ స్కెచ్‌

-మూలం అక్కడే ఉందా..?
వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విభాగాల్లోనూ  అవినీతి ప్రక్షాళన మొదలు పెట్టారు. ఈ క్రమంలో కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న టీటీడీలోనూ అవినీతిని ఏరివేసే కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలను వెలికితీసే ప్రయత్నం చేశారు. రికార్డుల దుమ్ము దులిపి.. అక్రమాలకు పాల్పడ్డవారి వ్యవహారాలను జనం ముందుంచే ప్రయత్నం చేశారు. ఈ చర్యే కొంత మందికి కంటగింపుగా మారింది. తమ అన్యాయాన్ని బయట పెడుతున్న జగన్ ప్రభుత్వ ప్రతిష్టకు ఏదో విధంగా నష్టం కలిగించాలనే ఉద్దేశంతో ఈ విగ్రహాల ధ్వంసానికి పాల్పడుతున్నారనే అభిప్రాయం వ్యకమవుతోంది. ప్రస్తుత ధ్వంస రచనకు మూలం.. టీటీడీలో అవినీతి ప్రక్షాళనే కారణమన్న భావన కలుగుతోంది. ఇదే అనుమానాన్ని పలువురు రాజకీయ ప్రముఖులు కూడా చేస్తుండడం గమనార్హం. తాజాగా.. ప్రముఖ బీజేపీ నేత, ఆ పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఏపీలో విగ్రహాల ధ్వంసంపై స్పందించారు. దీని వెనకున్న కారకులు ఎవరో తేల్చి చెప్పారు.

-చంద్రబాబే సూత్రధారి : సుబ్రహ్మణ్యస్వామి
‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం అంతా ప్రతిపక్ష నేత చంద్రబాబు కుట్రే. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే అక్కసుతో కొందరు ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం లాంటి చర్యలకు పాల్పడుతున్నారు’ అని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి స్పష్టం చేశారు. ప్రముఖ జాతీయ చానల్‌ ‘న్యూస్‌ ఎక్స్‌’ నిర్వహించిన చర్చలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు తెరవెనుక  ఉండి ఇదంతా చేయిస్తున్నారని చెప్పారు. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి ఏమన్నారంటే…

-కావాలనే దుష్ప్రచారం..
ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల దాడుల ఘటనలపై పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నా.. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారనే విషయం స్పష్టమవుతోంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్రిస్టియన్‌ అని విమర్శిస్తున్నారు. ఆయన క్రిస్టియన్‌ ఎలా అవుతారు? వైఎస్‌ జగన్‌ తిరుమలలో తెల్లవారుజామున 2 గంటలకు పూజలు చేశారు. కానీ ఆయన దాన్ని తన ప్రచారం కోసం వాడుకోలేదు. టీటీడీ ఆదాయ వ్యయాలను కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌)తో ఆడిట్‌ చేయించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి దేశంలో వైఎస్‌ జగన్‌ ఒక్కరే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నదంతా చంద్రబాబు కుట్ర. సోనియాగాంధీ(కాంగ్రెస్‌)తో కలసి పోటీచేస్తే ప్రజలు ఎవరూ ఆయన వైపు చూడలేదు. అందుకే ఆయన హిందుత్వను వేదికగా చేసుకుంటున్నారు.

Also Read: ఈ బినామీల వల్లే అసలు సమస్యలు

-టీటీడీలో క్రైస్తవులంటూ..
ఇక, టీటీడీలో క్రైస్తవులకు ఉద్యోగాలు ఇచ్చారంటూ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు. దీనిపై నేను విచారించాను. టీటీడీలో కేవలం ఏడుగురే అన్య మతస్తులు ఉన్నారు. వారు కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నియమితులైన వారు కాదు. అంతకు ముందు ప్రభుత్వంలో నియమితులైనవారే. వారిని కూడా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్లోకి బదిలీ చేసింది. ఇక ముందు టీటీడీలో హిందూయేతరులను నియమించరాదని విధాన నిర్ణయం కూడా తీసుకున్నారు. టీటీడీ చైర్మన్‌గా వైఎస్‌ జగన్‌ తన బంధువు వైవీ సుబ్బారెడ్డిని నియమిస్తే ఆయన క్రిస్టియన్‌ అని, ఆయన భార్య క్రిస్టియన్‌ మిషనరీ అని దుష్ప్రచారం చేశారు. వారిద్దరూ నరేంద్ర మోదీ కంటే కూడా పక్కా హిందువులు. అలాంటి వారిపై దుష్ప్రచారం చేశారు.

-పోలీసులనే అడిగితే తెలుస్తుంది..
ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోందో పోలీసులను అడిగితే తెలుస్తుంది. ఆలయాలపై దాడులు చేసినవారిపై  కేసులు నమోదు చేశారో లేదో చెబుతారు. అంతేగానీ బీజేపీ నేతలనో, కార్యకర్తలనో అడగవద్దు. ఈ విషయంలో ఎలాంటి చర్చకైనా నేను సిద్ధం.’ అని సుబ్రహ్మణ్య స్వామి తేల్చి చెప్పారు. ఇప్పుడు స్వామి వ్యాఖ్యలు సంచలనానికి కేంద్రం అయ్యాయి. ప్రభుత్వంపై బురద జల్లేందుకు విపక్షాలే విగ్రహాల ధ్వంసానికి పాల్పడుతున్నాయన్న అనుమానాలకు.. సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చాయి.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version