YS Sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తనయ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి చెల్లి వైఎస్.షర్మిల. అన్నతో గొడవ పడి తెలంగాణలో రాజకీయాలు చేద్దామని వచ్చింది. పార్టీ పెట్టింది. రాజన్న రాజ్యం తెస్తానని, ఆదరించడంని సుమారు 3 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. కానీ తెలంగాణ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో కాంగ్రెస్లో చేరాలనుకుంది. పార్టీని విలీనం చేస్తానని వెళ్లింది. పలు దఫాలుగా చర్చలు కూడా జరిపింది. కానీ, షర్మిల అనుకున్నది ఒకటి. మరొకటి జరుగుతోంది. డీకే శివకుమార్ రాయబారం.. నేరుగా సోనియా, రాహుల్తో మంతనాలు కొనసాగాయి. కానీ, షర్మిల ప్రతిపాదనలకు ఆమోదం దక్కలేదు. కాంగ్రెస్ మార్క్ రాజకీయం ఆలస్యంగా బోధపడిన షర్మిల ఇప్పుడు ఆ పార్టీతో విలీనానికి బ్రేక్ చెప్పారు. సొంతగా పోటీకి సిద్దమవుతున్నారు.
కాంగ్రెస్ మార్క్ రాజకీయం..
కొద్ది నెలలుగా షర్మిల కాంగ్రెస్లో చేరి పోటీ చేయటం.. పార్టీ విలీనం పైన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారు. పార్టీ విలీనం ద్వారా తెలంగాణలో షర్మిలకు తగిన గుర్తింపు.. పాలేరు పోటీకి సీటు.. అనుచరలకు ప్రాధాన్యత అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగింది. టీపీసీసీ చీఫ్ రేవంత్తో సహా మరి కొందరు తెలంగాణలో షర్మిలకు ప్రాధాన్యత వ్యతిరేకించారు. షర్మిలను ఏపీకి పరిమితం చేయాలని సూచన చేశారు. కానీ, షర్మిల తాను తెలంగాణలోనే పని చేస్తానని తేల్చి చెప్పారు. సోనియా, రాహుల్ తోనూ చర్చలు చేసారు. కానీ, ఫలితం రాలేదు.
కాంగ్రెస్ చెప్పినట్టే వినాలని..
షర్మిలకు తొలుత రాజ్యసభ ప్రతిపాదించారు. కాదంటే, ఫైనల్గా సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం ఇస్తామనే చర్చ తెర మీదకు వచ్చింది. షర్మిల తనకు పాలేరు సీటు ఇవ్వాలని పట్టు బట్టారని తెలుస్తోంది. అందుకు కాంగ్రెస్ నాయకత్వం నో చెప్పింది. షర్మిల అనుచర వర్గానికి సంబంధించి ఎటువంటి హామీ దక్కలేదు. సెప్టెంబర్ 30 వరకు కాంగ్రెస్కు షర్మిల డెడ్లైన్ విధించడంతో వ్యూహకర్త సునీల్ కొనుగోలు రంగంలోకి దిగి డీల్ ప్రతిపాదించారు. ఖమ్మం లోక్ సభ ప్రతిపాదించారు. దీంతో, రెండు రోజులుగా ఢిల్లీలోనే షర్మిల మకాం వేశారు. కానీ, కాంగ్రెస్ నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాలేదు. దీంతో, కాంగ్రెస్తో విలీనం ప్రక్రియకు బ్రేక్ చెప్పారు. తన పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. సొంతంగా పోటీకి నిర్ణయించినట్లు సమాచారం.
సింగిల్గానే బరిలో..
ఇక తెలంగాణ అసెంబ్లీ బరిలో షర్మిల సింగిల్గానే బరిలో దిగబోతున్నారు. ముందుగా అనుకున్నట్లుగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక నియోజకవర్గం అయిన పాలేరు అసెంబ్లీ నుంచి షర్మిల బరిలోకి దిగబోతున్నారు. ఇప్పటికే పార్టీ ఆఫీసు, వైఎస్సార్ విగ్రహాన్ని కూడా షర్మిల ప్రారంభించారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ పొంగులేటి బరిలోకి దిగనున్నారు. 119 నియోజకవర్గాల నుంచి పార్టీ తరఫున అభ్యర్థులను బరిలోకి దింపడానికి సన్నాహాలు ప్రారంభించారు.
చివరి నిమిషంలో కాంగ్రెస్ నుంచి సానుకూలంగా షర్మిల డిమాండ్ల పైన స్పందించి ముందుకు వస్తే మినహా వైఎస్సార్టీపీ ఎన్నికల్లో ఒంటరి పోరు ఖాయంగా కనిపిస్తోంది. దీంతో, ఈ ఎన్నికల్లో తెలంగాణలో షర్మిల రాజకీయ భవిష్యత్ ఏంటనేది స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.