Pawan Kalyan- Sajjala Ramakrishna Reddy: పవన్ సీరియస్ పొలిటీషియన్ కాదట. ఆయన ప్రజా సమస్యలెప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేదట. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించలేదట.. ఏపీ వైసీపీ ప్రభుత్వానికి, జగన్ కు కట్టప్పలా.. కట్టుబానిసలా వ్యవహరించి, నటించే పెద్దాయన సజ్జల రామక్రిష్ణారెడ్డి సెలవిచ్చిన మాటలివి. దీని వెనుక ఉన్న ఆంతర్యం వేరు. పవన్ ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసు కనుక ఇప్పుడు సజ్జల వారు హితబోధనలకు దిగుతున్నారు. ఒక వైపు కాపు మంత్రులతో పవన్ ను తిట్టిస్తునే.. ఇలా సజ్జల నీతి వాక్యాలతో రక్తికట్టిస్తున్నారు. తాను ఒక పద్ధతి ఉన్న వ్యక్తిగా ఏపీ సమాజానికి చూపిస్తూ.. తెర వెనుక మంత్రాంగాన్ని పఠిస్తున్నారు. ఇంతకు ముందు చూసిన సజ్జల వేరు.. ఇప్పుడు చూస్తున్న సజ్జల వేరు అన్నట్టు తనలో ఉన్న నటనా చాతుర్యాన్ని బయటపెడుతున్నారు. ఆ మధ్యన వచ్చిన ఒంగోలు గిత్తలో ప్రకాష్ రాజ్ పాత్ర తరహాలో ఇప్పుడు సజ్జల వారి క్యారెక్టర్ ఒక్కొక్కటీ బయటపడుతోంది.

చంద్రబాబు మాట్లాడితే కొడాలి నాని, వల్లభనేని వంశీ, పవన్ మాట్లాడితే అంబటి, గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని, బొత్సను ప్రయోగిస్తారు. సజ్జల మాత్రం అసలు సిసలు రాజకీయ అంశాలనే మాట్లాడతారు. తెలివి అంటే అది. అందుకే కాబోలు జగన్ నమ్మిన పెద్దమనిషిగా తన గ్రాఫ్ ను అమాంతం పెంచుకున్నారు. ఎక్కడో సాక్షి పత్రికలో ఎడిటోరియల్: బోర్డులో ఉన్న వ్యక్తికి సలహాదారుడిగా ప్రమోషన్ ఇచ్చారు. తన తండ్రితో పనిచేసిన సహచరుల కంటే జగన్ అతడికే ప్రాధాన్యమిస్తున్నారు. పార్టీలోను, ప్రభుత్వంలోనూ యాక్టివ్ రోల్ ను కట్టబెట్టారు. ఎంతో మంది సీనియర్లు, కాకలు తీరిన నేతలు సైతం సజ్జల ముందు చేతులు కట్టుకొని నిలబడేలా జగన్ ఎన్నో విచక్షణాధికారాలను సజ్జల చేతిలో పెట్టారు. ఇంకేముంది 13 జిల్లాల్లో ప్రత్యర్థులను ఆటాడేస్తున్నారు. పనిలో పనిగా సొంత పార్టీలో అసమ్మతి నాయకులపై సైతం ప్రతాపం చూపుతున్నారు.
వాస్తవానికి పవన్ సజ్జల విషయంలో చాలా బాధ్యతగా వ్యవహరించారు. ఆయన పెద్దరికానికి చాలా వాల్యూ ఇచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే క్రమంలో గతంలో పవన్ సజ్జలపై పరోక్ష విమర్శలు చేశారు. దానికి సజ్జల వారు నొచ్చుకున్నారు. దీనిపై పవన్ స్పందించారు కూడా. సజ్జలపై తనకున్న గౌరవభావాన్ని వ్యక్తపరిచారు కూడా. అయినా జగన్ పట్ల విధేయత, స్వామిభక్తి ముందు పవన్ తనపై చూపిన గౌరవభావాన్ని సజ్జల నిలబెట్టుకోలేకపోయారు సరికదా.. అదే పవన్ ను నిర్వీర్యం చేయాలని.,. ఆయన పార్టీని కబళించాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాజకీయ వికృత క్రీడను ప్రారంభించారు. అందులో భాగమే విశాఖ ఎపిసోడ్.. తరువాత ఇప్పటం విధ్వంసం. పవన్ అది గుర్తెరిగే తన గౌరవభావాన్ని మిస్ యూజ్ చేసుకున్న జగన్ సర్కారు కట్టప్ప సజ్జల రామక్రిష్ణారెడ్డి చర్యలను గమనించడమే కాదు.. ధ్వజమెత్తడం ప్రారంభించారు.

ఇప్పుడు సజ్జలకు ఒక్క జగనే పవర్ ఫుల్ నాయకుడు. మిగతావారంతా ఆయన ముందు దిగదుడుపే. పవన్ సీరియస్ పొలిటీషియన్ కాదని సెలవిచ్చేశారు. అయితే ఇది భయంతో చేసిన వ్యాఖ్య మాత్రమేనని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, శాంతిభద్రతలు, అధికార పార్టీ దురాగతాలు, కబ్జాలు, అవినీతిపై పవన్ ప్రశ్నిస్తున్నారు. కానీ ఇవన్నీ ప్రజల కోసం కాదన్నట్టు సజ్జల భావిస్తున్నారు. వైసీపీని ఓడిస్తానన్న పవన్ హెచ్చరికలను కేవలం రాజకీయ కోణంలో చూస్తున్నారు. వైసీపీ విముక్త ఏపీ కోసం పోరాడుతానన్న మాటలను జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకేతన పెద్దరికాన్ని, ప్రత్యర్థులు, మిగతా పక్షాలు తనకు ఇచ్చిన గౌరవభావాన్ని జగన్ కోసం తాకట్టు పెట్టుకుంటున్నారు. జగన్ ను మరోసారి అధికారంలోకి తేవడం తప్ప తనకు మరో టాస్కులేదన్నట్టు భావిస్తున్నారు. అందులో భాగంగానే పవన్ పై విష ప్రచారం మొదలుపెట్టారు.