ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ 20 లక్షల కోట్ల ఆత్మ నిర్భర భారత్ ప్యాకేజీ వివరాలను వరుసగా మూడో రోజున వెల్లడిస్తూ
వ్యవసాయం, సాగు అనుబంధ రంగాలకు ఊతమిచ్చే పలు చర్యలను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వ్యవసాయంలో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు రూ లక్ష కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తామని ఆమె వెల్లడించారు.
లాక్డౌన్ కాలంలో రైతుల ఖాతాల్లో రూ. 18,730 కోట్లను జమచేయడంతో పాటు రైతుల నుంచి రూ 74,300 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించామని ఆమె గుర్తు చేశారు. వ్యవసాయం, మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు ఊతమిచ్చేలా ఉద్దీపన ప్రకటించామని పేర్కొన్నారు.
పాడి పరిశ్రమలో మౌలిక సదుపాయల అభివృద్ధికి రూ.15,000 కోట్ల పశుసంవర్ధక మౌలిక సదుపాయాల నిధిని ఏర్పాటు చేస్తూ, పశువుల్లో మూతి, కాలి వ్యాధుల నివారణ కోసం నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ కు రూ.13,343 కోట్లు ఖర్చు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
కరోనా లాక్ డౌన్ సమయంలో పాలకు 25 శాతం మేరకు డిమాండ్ కోల్పోయిన పాడి పరిశ్రమను ఆదుకొనేందుకు ఆర్ధిక మంత్రి పలు చర్యలు ప్రకటించారు. 2 కోట్ల మంది పాడి రైతులకు రూ.5 వేల కోట్ల మేర ప్రోత్సాహకాలు కల్పించనున్నట్లు తెలిపారు.
అలాగే 2 కోట్ల మంది పాడి రైతులకు మేలు చేసేలా 2020-21 సంవత్సరంలో కొత్త పథకాన్ని తీసుకొస్తున్నామని, డెయిరీ సహకారాల ద్వారా రుణాలపై 2 శాతం రాయితీ కల్పిస్తామని ఆర్ధిక మంత్రి ప్రకటించారు. దీని ద్వారా రూ.5,000 కోట్ల అదనపు లిక్విడిటీ అందుబాటులోకి రానుందని చెప్పారు.
మత్స్యకారుల కోసం రూ.20 వేల కోట్లతో పీఎం మత్స్య సంపద యోజన పథకాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. 55 లక్షల మందికి ఉపాధి కల్పించేలా, దేశ ఆక్వా ఉత్పత్తులు రెట్టింపయ్యేలా కార్యాచరణను సిద్ధం చేసినట్లు నిర్మల ప్రకటించారు. గడువు తీరిన 242 ఆక్వా హేచరీలకు రిజిస్ట్రేషన్ గడువు 3 నెలలు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు.
దేశ వ్యాప్తంగా గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు, పందులకు 100 శాతం వ్యాక్సినేషన్ చేసేందుకు ఈ నిధులు వినియోగించనున్నట్లు తెలిపారు.