కరోనా కల్లోలంతో లాక్డౌన్ సమయంలో పేదలు ఎవ్వరు ఆకలితో అలమటించకుండా చూడడం కోసమై ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ రూ 1.70 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీని ప్రకటించారు.
గరీబ్ కల్యాణ్ పేరుతో ప్రకటించిన ఈ భారీ ఆర్ధిక ప్యాకేజీలో ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారు, రోజువారీ కూలీలను ఆదుకోవడం కోసమై ఉద్దేశించారు.
లాక్డౌన్ కారణంగా దేశంలో ఆకలి చావులు లేకుండా కేంద్రం అన్ని ఏర్పాట్లు చేసిందనీ, పేదలకు నేరుగా సాయం అందేలా చర్యలు తీసుకుంటామని నిర్మల ప్రకటించారు. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్యం సిబ్బందికి రూ.50 లక్షల మేర ఆరోగ్య బీమాను కల్పించనున్నట్టు ఆమె వెల్లడించాయిరు.
80 కోట్ల మంది పేద ప్రజలకు ఇప్పుడిస్తున్న రూ.5 కేజీల బియ్యం, గోధుమలకు అదనంగా మరో 5 కేజీలు ఉచితంగా అందిస్తామని నిర్మల పేర్కొన్నారు. ఇప్పుడిస్తున్న 1 కేజీ పప్పు ధాన్యాలకు అదనంగా మరో కేజీ పప్పు ధాన్యాలు ఇస్తామని తెలిపారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద వచ్చే మూడు నెలల పాటు ఈ అదనపు ప్రయోజనాలు అందిస్తామని చెప్పారు.
నరేగా కింద దినసరి కూలీని రూ.182 నుంచి రూ.202కు పెంచుతున్నామని, దీని ద్వారా దాదాపు ఐదు కోట్ల మందికి లాభం కలుగుతుందని ఆర్ధిక మంత్రి తెలిపారు. కనీసం వీరి ఆదాయం రూ.2000 దాకా పెరుగుతుందని పేర్కొన్నారు.
నిరుపేద వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు రెండు వాయిదాల చొప్పున రూ.1000ను అందజేస్తామని, వీటి ద్వారా సుమారు మూడు కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. దేశంలో ఉన్న 20.5 కోట్లు గల మహిళల జన్ దన్ ఖాతాలో నెలకు రూ.500 చొప్పున నేరుగా సొమ్మును మూడు నెలలపాటు జమచేస్తామని వెల్లడించారు.
కరోనా బాధితులకు వైద్యసాయం అందించే ప్రతి ఆరోగ్య సిబ్బందికి సుమారు రూ.50 లక్షల బీమా సౌకర్యాన్ని వచ్చే మూడు నెలల దాకా కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో డాక్టర్లు, పారామెడికల్, ఆరోగ్య సిబ్బంది, కరోనా కోసం పని చేసే ఆశా వర్కర్లు.. ఇలా మొత్తం ఇరవై లక్షల మంది ప్రయోజనం పొందుతారని వివరించారు.
సంఘటిత రంగంలో పని చేసే ఉద్యోగులకు వచ్చే మూడు నెలల కాలానికి కేంద్ర ప్రభుత్వమే 24 శాతం ఈపీఎఫ్ చెల్లిస్తుందని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వంద ఉద్యోగులు ఉన్న సంస్థల్లో, దాదాపు తొంభై శాతం మంది జీతం నెలకు రూ.15,000 లోపు ఉన్నవారికి ఇది వర్తిస్తుందని వివరించారు. అంతేకాకుండా 75 శాతం పీఎఫ్ విత్ డ్రా కూడా చేసుకోవచ్చని ఆమె తెలిపారు.
ఉజ్వల లబ్ధిదారులకు నెలకు ఒకటి చొప్పున మూడు గ్యాస్ సిలిండర్లు 8 కోట్లమంది మహిళలకు ఉచితంగా ఇస్తామని తెలిపారు. డ్వాక్రా మహిళలకు ఇచ్చే రుణాలు రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచుతున్నామని ప్రకటించారు. 8.69 కోట్ల మంది రైతులకు సంవత్సరానికి రూ 6,000 మొత్తంలో తక్షణం రూ 2,000 అందిస్తామని వెల్లడించారు.
నమోదైన 3.5 కోట్ల మంది నిర్మాణమని కార్మికులకు గల రూ 31,000 కోట్ల సంక్షేమ నిధిని వారి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించుకోవచ్చని ఆర్ధిక మంత్రి తెలిపారు. అదే విధంగా జిల్లా స్థాయిలో అందుబాటులో ఉన్న మినరల్ నిధులను వారి ఆరోగ్యాల కోసం ఉపయోగించుకోవచ్చని ఆమె చెప్పారు.