కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజీవ్ పేరు తొలగించడానికి ఇదే సరైన సందర్భంగా భావించింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్భంలో రాజీవ్ దేశం కోసం తన ప్రాణాన్ని అర్పించిన గొప్ప మహనీయుడని కొనియాడుతున్నారు. అలాంటి నేత పేరును తొలగించడం సముచితం కాదని చెబుతున్నారు. కేంద్రం కావాలనుకుంటే ధ్యాన్ చంద్ పేరుతో మరో పురస్కారం ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. కేంద్రం మాత్రం రాజీవ్ పేరు తొలగించడానికే నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఇప్పటివరకు ధ్యాన్ చంద్ జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆయన పేరుపైనే పురస్కారం ఇవ్వడం గొప్ప విషయంగా అభివర్ణిస్తున్నారు. అయితే ఇందులో రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు ధ్యాన్ చంద్ పేరు పెట్టడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.
దేశంలో హాకీ క్రీడను ప్రోత్సహించింది ఒడిశా ప్రభుత్వమే. సీఎం నవీన్ పట్నాయక్ ప్రభుత్వం తరఫున స్పాన్సర్ షిప్ అందించడం వల్లే హాకీ క్రీడ బతికుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. అలాంటి క్రీడపై కేంద్రానికి ఎందుకు అంత పట్టింపు అని ప్రశ్నలు వస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం హాకీ జట్టు విజయాల్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం బీజేపీకి కలిసొస్తుందో లేదో వేచి చూడాల్సిందే.