రాహులు గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని వదిలేశారు. ఇప్పటికీ ఆ కుర్చీ అలాగే ఉంది. కారణం ఏంటీ? ఎందుకు ఆయన ఆ బాధ్యతలను తీసుకోలేదు అనే చర్చ వచ్చినప్పుడు.. ప్రత్యర్థులు ఆయనకు అంతసీన్ లేదని విమర్శిస్తుంటారు. కానీ.. వాస్తవం అది కాదన్నది అసలు సంగతి. వందేళ్లు దాటిన కాంగ్రెస్ నిండా వృద్ధులే సీనియర్లుగా ఉన్నారు. రాహుల్ బలమైన నిర్ణయాలు తీసుకోవాలని చూసిన ప్రతిసారీ.. వారు అడ్డు పడడం పరిపాటిగా మారిపోయింది. గ్రూప్-32 పేరుతో ఏర్పడిన కాంగ్రెస్ సీనియర్లంతా.. నాయకత్వం మీద నిరసన తెలుపుతున్నారు. ఇదే నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది. దీంతో విసిగిపోయిన రాహుల్ కాడి వదిలేశారు.
ఆ విధంగా రాహుల్ నిరసన తెలిపారు సరే. కానీ.. ఇదే పరిస్థితి కొనసాగితే.. పార్టీ చరిత్ర పుస్తకాల్లో చదువుకునేలా మిగిలిపోయే పరిస్థితి రాబోతోంది. ఆ సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో.. సోనియా గాంధీ కుమారుడికి ఫుల్ పవర్స్ ఇచ్చేసినట్టు సమాచారం. ఏం చేసైనా సరే.. పార్టీని మాత్రం అధికారంలోకి తేవాలని చెప్పారట. అడ్డుగా ఉన్న ఎవరినైనా పక్కకు తప్పించేయాలని చెప్పారట. దీంతో.. రాహుల్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రెండు సార్లు అధికారానికి దూరమవడంతోపాటు పార్టీ పరిస్థితి ఆందోళన కలిగించే స్థాయికి పడిపోతోంది. అందుకే.. ప్రియాంక కూడా అన్నకు మద్దతుగా పూర్తిస్థాయిలో రంగంలోకి దిగబోతున్నారట.
వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి తనదైన యూత్ టీమ్ ను సిద్ధం చేసుకోబోతున్నారు రాహుల్. అన్ని రాష్ట్రాల్లోనూ యాక్టివ్ గా ఉన్న నేతలకు, ప్రజాభిమానం ఉన్న లీడర్లకు మాత్రమే పట్టం కట్టాలని డిసైడ్ అయ్యారు. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి రాహుల్ గాంధీకి కట్టబెట్టడానికి ప్రధాన కారణం ఇదేనని అంటున్నారు. దీన్ని అడ్డుకునేందుకు సీనియర్లు ఎంతగా ప్రయత్నించారో తెలిసిందే. చేయాల్సినవి అన్నీ చేశారు. రేవంత్ రెడ్డికి పదవి ఇస్తే మాత్రం.. తామంతా కాంగ్రెస్ ను వదిలి వెళ్లిపోతామంటూ బెదిరింపులు చేశారు. అయినా.. అవన్నీ లైట్ తీసుకున్నారు రాహుల్. మీకు ఇష్టమొచ్చింది చేసుకోండి అన్నట్టుగా వ్యవహరించారు.
రేవంత్ విషయంలోనే కాకుండా.. ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల్లోనూ ఇదేవిధంగా నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అటు పంజాబ్ లో ఈ తరహా రాజకీయమే కొనసాగుతోంది. అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. కానీ.. ముఖ్యమంత్రిగా ఉన్న ఎనభై ఏళ్ల అమరీందర్ సింగ్.. ఇప్పటికీ పార్టీని తన కనుసన్నల్లోనే నడిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితికి సైతం రాహుల్ చెక్ పెడుతున్నారు. అసమ్మతి నేగా ఉన్న నవజ్యోత్ సింగ్ సిద్ధుకు మద్దతు పలుకుతున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన సిద్ధూతో ఏకంగా 2 గంటలపాటు రాహుల్, ప్రియాంక సమావేశమయ్యారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లిన అమరీందర్ తో కనీసం మాట్లాడకపోవడం గమనించాల్సిన అంశం.
అన్ని రాష్ట్రాల్లోనూ ఇదేవిధంగా.. సమూల ప్రక్షాళన చేయబోతున్నట్టు సమాచారం. ఇది ఖచ్చితంగా సాహసోపేత నిర్ణయమే అయినా.. రాహుల్ ముందుకే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సాహసం చేస్తేనే విజయం దక్కుతుందన్న సూత్రాన్ని విశ్వసిస్తూ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వచ్చే ఏడాది జిరగే ఐదు రాష్ట్రాల ఎన్నికల నాటికి చాలా మార్పులు చేపట్టాలని, ఇక, 2024లో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్ యువతరంతో నిండిపోవాలని కలలు కంటున్నారు రాహుల్. మరి, ఆ కలలు నిజమవుతాయా? కల్లలు అవుతాయా? అన్నది చూడాలి.