గతంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గడ్ స్టేట్లలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక ఇదే ఊపును కొనసాగించాలని భావించింది. అధిష్టానం కూడా అదే బాటలో నడవాలని నేతలకు హామీలు ఇచ్చి వారికి పదవులు పంపిణీ చేసింది. చత్తీస్ గడ్ లో సీఎం పీఠం కోసం జరిగిన పోటీలో భూపేస్ బగేల్ పదవి చేజిక్కించుకోగా సింగ్ దేవ్ కు రెండున్నరేళ్ల తరువాత అవకాశం కల్పిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం పీకే రాకతో పార్టీలో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించాక పార్టీ బలోపేతం దిశగా పయనిస్తోంది. నేతల్లో చురుకుతనం పెరిగిపోతోంది. దీంతో నేతల్లో ఆశావహ దృక్పథం ఇనుమడిస్తోంది. పంజాబ్ లో కూడా నవజ్యోతి సింగ్ సిద్దూను పీసీసీ అధ్యక్షుడిని చేశాక నేతల్లో మంచి ఊపు వస్తోంది. పీకే సూచించిన మార్పులతో పార్టీ మంచి ఫలితాలు సాధిస్తోంది.
ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకే చేర్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రాంతీయ పార్టీలతో కలిసి నడిచేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే శరత్ పవార్, మమతా బెనర్జీ, స్టాలిన్ లాంటి నేతలు పలుమార్లు భేటీ అయి భవిష్యత్ వ్యూహంపై కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రాంతీయ పార్టీల బలంతోనే ఎన్డీఏను దెబ్బకొట్టాలని భావిస్తున్నారు. దీనికి ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రణాళిక రచిస్తున్నారు.
ఎన్డీఏను ఢీకొట్టడమంటే మాటలు కాదని తెలిసినా థర్డ్ ఫ్రంట్ సన్నాహాలు మాత్రం వేగం పుంజుకుంటున్నాయి. బీజేపీని దెబ్బతీయాలను కాంగ్రెస్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలు ఎండగట్టి తన ప్రభావం చూపాలని మూడో కూటమి చూస్తోంది. దీనికి గాను అన్ని ప్రాంతాల నేతలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు పావులు కదుపుతోంది. ఎన్డీఏ పాలనలోని లోపాలను ఎత్తిచూపి ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావిస్తోంది.