TRS MLAs Purchase Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బీజేపీకి, కేసులోని ముగ్గురు నిందితులకు షాక్ ఇచ్చింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఓ రాజకీయ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు పరిగణనలోకి తీసుకోవడాన్ని తప్పుపట్టింది. దీంతో ఈ కేసులో తెలంగాణ హైకోర్టు తమకు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్తోపాటు బీజేపీకి కూడా షాక్ ఇచ్చినట్లు అయింది.

నిందితుల పిటిషన్పనై విచారణ..
ఎమ్మెల్యేలకు ఎర కేసులో తమను బలి చేస్తున్నారని ముగ్గురు నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ బీఆర్.గవాయ్, జస్టిస్ బీవీ.నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారంవిచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కేవీ.విశ్వనాథన్ వాదనలు వినిపించారు. ఏడేళ్లలోపు శిక్షపడే కేసుల్లో 41 (ఏ) నోటీసు ఇవ్వకుండా నిందితులను అరెస్టు చేయకూడదని సుప్రీంకోర్టు ఉత్తర్వులున్నా అందుకు విరుద్ధంగా అరెస్టు చేశారని తెలిపారు. ఫిర్యాదుదారులు నిఘా బృందానికి కాకుండా సాధారణ పోలీసులకు ఫిర్యాదు చేశారని, ట్రాప్ చేశారని ధర్మాసనానికి తెలిపారు. దర్యాప్తుపై స్టే కోరుతూ భారతీయ జనతా పార్టీ హైకోర్టును ఆశ్రయించిందని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తెలుపిరారు. దర్యాప్తుపై స్టే విధించాలని ఓ పార్టీ ఎందుకు పిటిషన్ దాఖలు చేసిందని, దాన్ని హైకోర్టు విచారణకు ఎలా స్వీకరించిందని ద్విసభ్య ధర్మాసనం ప్రశ్నించింది.
తమకు సంబంధం లేదన్న నిందితులు..
బీజేపీ దర్యాప్తుపై స్టే కోరుతూ వేసిన పిటిషన్తో తమకు ఎలాంటి సబంధం లేదని ముగ్గురు నిందితుల తరఫు న్యాయవాది విశ్వనాథన్ సుప్రీం కోర్టుకు విన్నవించారు. తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య జరుగుతున్న యుద్ధంతో తాము నలిగిపోతున్నామని, ఎవరో పిటిషన్ దాఖలు చేస్తే తమను నిందిస్తున్నారని ధర్మాసనానికి తెలిపారు. అయితే, న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి వారెవరని (బీజేపీ) ప్రభుత్వ న్యాయవాది లూథ్రా ప్రశ్నించారు. ఈ దశలో జస్టిస్ బీఆర్.గవాయ్ జోక్యం చేసుకున్నారు. పిటిషన్ దాఖలుకు ఆ పార్టీకి ఉన్న అర్హత ఏమిటని హైకోర్టు ప్రశ్నించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ‘ట్రాప్ కేసుల్లో నిందితులను సాధారణంగా అదే రోజు విడుదల చేస్తారు… డబ్బు కూడా స్వాధీనం కాలేదు కదా’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నేరం చేశారని భావిస్తే పోలీసులు అరెస్టు చేయవచ్చని లూథ్రా తెలిపారు.

హైకోర్టు విచారణలో ఏం జరిగింది..
హైకోర్టులో పోలీసులు పిటిషన్ చేసిన సందర్భంగా జరిగిన విచారణలో ఏం జరిగిందని ద్విసభ్య ధర్మాసనం ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. దర్యాప్తును హైకోర్టు పెండింగ్లో పెట్టి తమ చేతులు కట్టివేసిందని లూథ్రా బదులిచ్చారు. వాదనల అనంతరం.. ‘నిందితుల బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టడానికి ఈ కోర్టుతోపాటు హైకోర్టులో పెండింగ్లో ఉన్న పిటిషన్లు అడ్డంకి కాదు. నిబంధనల ప్రకారం విచారణ చేపట్టవచ్చు. కేసు పూర్వాపరాల ఆధారంగా ట్రయల్ కోర్టు పిటిషన్లను పరిగణనలోకి తీసుకోవచ్చు’ అని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అనంతరం విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
ప్రభుత్వం విన్నపంపై అసహనం..
కేసు వాయిదా వేసిన తర్వాత కూడా తాము దాఖలు చేసిన రిమాండ్ అప్లికేషన్ను పరిశీలించేలా ట్రయల్ కోర్టును ఆదేశించాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది లూథ్రా ధర్మాసనానికి పదే పదే విజ్ఞప్తి చేశారు. దీంతో అసమనానికి గురైన న్యాయమూర్తులు.. ఇలానే కోరితే నిందితులకు బెయిల్ ఇచ్చేస్తాం అని హెచ్చరించింది.
మొత్తంగా ఈ కేసులో నిందితులతోపాటు, బీజేపీకి సుప్రీం ధర్మాసనం షాక్ ఇవ్వగా, తెలంగాణ ప్రభుత్వానికి కూడా హెచ్చరిక జారీ చేసింది.