కృష్ణా నది యజమాన్య బోర్డు సమావేశంలో తెలుగు రాష్ట్రాలు వాడివేడి వాదనలు వినిపించాయి. ముందుగా తెలంగాణ, తర్వాత ఏపీ వారి వారి వాదనలు వినిపించాయి. తెలంగాణ తరపున నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్కుమార్ వాదనలు వినిపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కట్టొద్దని తేల్చి చెప్పింది. ఈ మేరకు కృష్ణా నదిపై ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలోనే అనుమతులు వచ్చాయని ఆయన వ్యాఖ్యానించారు. వాటినే తాము కొనసాగిస్తున్నామని వివరించారు.. విభజన అనంతరం నిర్మిస్తున్న ప్రాజెక్టు కాబట్టి అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.
ఏపీ తరపున ఆదిత్యనాథ్ దాస్ వాదనలు వినిపించారు. తెలంగాణ వాదనను ఏపీ తప్పుబట్టింది. ఏపీకి నీటి కేటాయింపుల ఆధారంగానే…పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకాలు చేపడుతున్నామని అన్నారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ప్రాజెక్టుల డిజైన్ మార్చిందని ఆయన అన్నారు. అందుకే తెలంగాణ ప్రాజెక్టులను కొత్తవిగా భావించాలని వాదించారు. తెలంగాణ ప్రాజెక్టుల రీ డిజైన్ వల్ల ఏపీకి నష్టం జరుగుతుందని అన్నారు.