దేశాన్ని మోడీ అన్ లాక్ చేసే సాహసం చేస్తారా?

లాక్ డౌన్ నిబంధనలు ప్రధాని మోడీ సడలించడం మొదలు పెట్టాక దేశంలో కేసుల సంఖ్య ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రోజురోజుకు కేసులు జెట్ స్పీడుగా పెరుగుతున్నాయి. ఒక్కరోజులోనే ఏకంగా 8-9వేల వరకు కేసులు పెరుగుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య దేశంలో 2.17 లక్షలు దాటింది. దీంతో ఎలా కట్టడి చేయాలో తెలియక మోడీ సర్కార్ చేతులెత్తేసింది. లాక్ డౌన్ ఎత్తివేయడంతో జనాలు అంతా రోడ్డెక్కడం.. ఉద్యోగాలు చేసుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందంటున్నారు. […]

Written By: admin, Updated On : June 4, 2020 7:50 pm
Follow us on

లాక్ డౌన్ నిబంధనలు ప్రధాని మోడీ సడలించడం మొదలు పెట్టాక దేశంలో కేసుల సంఖ్య ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రోజురోజుకు కేసులు జెట్ స్పీడుగా పెరుగుతున్నాయి. ఒక్కరోజులోనే ఏకంగా 8-9వేల వరకు కేసులు పెరుగుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య దేశంలో 2.17 లక్షలు దాటింది. దీంతో ఎలా కట్టడి చేయాలో తెలియక మోడీ సర్కార్ చేతులెత్తేసింది. లాక్ డౌన్ ఎత్తివేయడంతో జనాలు అంతా రోడ్డెక్కడం.. ఉద్యోగాలు చేసుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందంటున్నారు. అందరూ బయటకు రావడం.. కరోనా నియంత్రణ జాగ్రత్తలు తీసుకోకపోవడం.. మాస్క్ లు, శానిటైజర్లు వంటివి వాడకపోవడంతో ఈ వైరస్ వ్యాప్తి దేశంలో పెరిగిపోతోంది. ఇక పాజిటివ్ వచ్చాక 14 రోజులకు లక్షణాలు బయటపడుతున్నాయి. కానీ ఆ వైరస్ సోకిన వ్యక్తి ఈ 14 రోజుల్లో వందల మందికి వైరస్ అంటించేస్తున్నాడు. ఇది కూడా దేశంలో వైరస్ కేసులు భారీగా పెరగడానికి కారణమవుతోంది.

ఇక ముంబై, ఇతర రాష్ట్రాలకు పనినిమిత్తం వెళ్లిన వలస కార్మికులు వైరస్ ను వెంటబెట్టుకొని సొంతూళ్లకు రావడం కూడా వైరస్ పెరగడానికి కారణమవుతోంది. ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో ఇప్పుడు కరోనా చిచ్చు రేపుతోంది.

ప్రస్తుతం కరోనా వైరస్ దేశంలో సామాజికవ్యాప్తి దశలోకి వచ్చింది. ఎవరి నుంచి.. ఎక్కడి నుంచి ఎవరికి సోకుతుందనేది చెప్పడం కష్టం. సో ఇక నుంచి కంటైన్మెంట్ జోన్లు పెట్టడం.. మొత్తం ఆ వీధులు, గ్రామాలు లాక్ డౌన్ చేయడం చాలా రిస్క్ తో కూడుకున్నది. కాబట్టి ప్రజలే స్వీయ నియంత్రణ పాటించాలి. లేకపోతే ఆ వీధి, గ్రామ ప్రజలంతా కంటైన్మెంట్లతో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

జూన్ 8 నుంచి దేశంలో ఆలయాలు, హోటల్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ తెరిచేందుకు కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇప్పుడు దేశంలో కరోనా కేసులు రెండు లక్షలు దాటుతున్న దృష్ట్యా దీనిపై పునరాలోచన చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆన్ లైన్ ఫుడ్ డెలవరీ సంస్థలకు అనుమతులు ఇచ్చి రద్దు చేసిన కేంద్రం ఇప్పుడు కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆలయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ కు సైతం అనుమతులు ఇవ్వరాదని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

ఇక తాజాగా లాక్ డౌన్ తో మూత పడి వేలకోట్ల నష్టాన్ని చవిచూస్తున్న సినీ పరిశ్రమకు సైతం కేంద్రం గట్టి షాక్ ఇచ్చింది. దేశ సినీ పరిశ్రమను తిరిగి తెరవాలని కేంద్ర మంత్రి జవదేకర్ ను సినీ పరిశ్రమ సంఘాల ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని కోరారు. అయితే ఆయన సానుకూలంగా స్పందించలేదు. దేశవ్యాప్తంగా సినిమా హాళ్లను తెరిచే అంశం జూన్ తర్వాతేనని స్పష్టం చేయడంతో సినీ పరిశ్రమ ఆశలపై నీళ్లు చల్లినట్టైంది.

జూన్ తర్వాత కేసులు తగ్గుముఖం పడితేనే థియేటర్ల విషయంలో ఆలోచిస్తామని కేంద్రమంత్రి జవదేకర్ తెలిపారు. తగ్గకపోతే మరో నెలపాటు థియేటర్స్ బందేనని స్పష్టం చేశారు. దీంతో కనీసం మూడు నెలల వరకైనా సినిమా థియేటర్స్ బంద్ ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో దేశ సినీ పరిశ్రమకు ఈ వార్త శరాఘాతంగా మారింది. థియేటర్ యాజమాన్యాలు దివాళా తీసే పరిస్థితి ఏర్పడనుంది. ఈ పరిణామం సినిమా పరిశ్రమకే పెద్ద షాక్ గా అభివర్ణిస్తున్నారు.

ఇలా ఇప్పటికే సడలింపులతో లాక్ డౌన్ ను నెమ్మదిగా ఎత్తివేస్తున్న ప్రధాని మోడీ జూన్ 8న కనుక అన్నింటిని ఓపెన్ చేయిస్తే మరిన్ని కేసులు పెరుగడం ఖాయం. ఆలయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్ లో పెద్ద ఎత్తున జనాలు గుమిగూడుతారు. ఇప్పటికే వైరస్ విస్తృతి పెరుగుతున్న దృష్ట్యా మోడీ సర్కార్ దేశాన్ని అన్ లాక్ చేస్తుందా? మొత్తం ఓపెన్ చేసే సాహసం చేస్తుందా లేదా అన్నది వేచిచూడాలి.

-నరేశ్ ఎన్నం