Narendra Modi : ప్రధాని నరేంద్ర మోడీ తన పాపులారిటీని నిరూపించుకున్నారు. ప్రపంచంలో అత్యధిక ప్రజాదరణ ఉన్న నాయకుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. మొత్తం 13 మంది నేతలకు సంబంధించి సర్వే చేయగా.. వారిలో భారత ప్రధాని తొలి స్థానం సాధించారు. ప్రజల్లో మోడీకి 70 శాతం ఆదరణ ఉందని అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ తన సర్వేలో పేర్కొంది.
ఈ సంస్థ.. రోజులు, వారాల్లో వివరాలు సేకరిస్తూ ఉంటుంది. సెప్టెంబర్ 2వ తేదీ నాటికి సేకరించిన గణాంకాల ప్రకారం ఈ వివరాలు వెల్లడించింది. నరేంద్ర మోడీ తర్వాత స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెప్ ఓబ్రడార్ ఉన్నారు. ఆ తర్వాత ఇటలీ ప్రదాని మారియో ఢ్రాఘి, యూఎస్ ప్రెసిడెంట్ బైడెన్, జర్మన్ ఛాన్సలర్ మెర్కెల్ వరుసగా ఉన్నారు. జూన్ లో 66 శాతానికి పడిపోయిన మోడీ ప్రజాదరణ.. ఇప్పుడు 70 శాతానికి చేరడం విశేషం.
మోడీ 70 శాతంతో తొలి స్థానంలో ఉండగా.. ఓబ్రడార్ 64 శాతం, ఢ్రాఘి 63 శాతం మెర్కెల్ 52 శాతం ప్రజాదరణ పొందారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ మాత్రం యాభైశాతం కిందకు పడిపోయారు. బైడెన్ 48 శాతం ప్రజాదరణ పొందారు. మోరీసన్ 48 శాతం, ట్రూడో 45 శాతం, జాన్సన్ 41 శాతం బోల్సనారో 39 శాతం ప్రజాదరణ పొందారు.
ఇక, జనం నుంచి తిరస్కరణ ఎదుర్కొంటున్న జాబితాను కూడా ఈ సర్వే సంస్థ వెల్లడించింది. ఇందులో జపాన్ ప్రధాని సుగా మొదటి స్థానంలో ఉన్నారు. ఈయనను 64 శాతం మంది వ్యతిరేకిస్తున్నట్టుగా మార్నింగ్ కన్సల్ట్ సంస్థ పేర్కొంది. ఈ జాబితాలో మోడీ చివరి స్థానంలో ఉన్నారు. మోడీని 25 శాతం మంది వ్యతిరేకిస్తున్నట్టు సర్వే తెలిపింది.
మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిత్యం ప్రపంచంలోని 11 వేల మంది నుంచి వివరాలు సేకరిస్తూ ఉంటుంది. ఆన్ లైన్ ద్వారానే ఈ వివరాలను సేకరిస్తారు. ఒక దేశంలో ఒక వారంలో నెటిజన్లు చెప్పిన సమాచారాన్ని సగటు చేసి ఫలితాలను ప్రకటిస్తారు. దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందిస్తూ.. భారత ప్రజలకు నరేంద్ర మోడీపై ఉన్న ప్రజాదరణకు ఈ సర్వే నిదర్శనమని చెప్పుకొచ్చారు.