Posani Krishna Murali
Posani Krishna Murali: పోసానికృష్ణ మురళి మరోసారి అనుచిత వ్యాఖ్యలకు దిగారు. అమరావతి ఆర్ 5 జోన్లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. దీనికి బాధ్యులను చేస్తూ చంద్రబాబుపై హాట్ కామెంట్స్ చేశారు. ఆయన కులంలో పుట్టినందుకు సిగ్గుగా ఉందంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. అమరావతిలో పేదలకు ఇళ్లు లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్న ఆ ప్రాంత రైతుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మాటలు వింటే సర్వనాశనం తప్పదని హెచ్చరించారు.
అటు పవన్ కళ్యాణ్పై సైతం నిప్పులు చెరిగారు. ఘాటు పదాలతో విరుచుకుపడ్డారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలంటూ పవన్ కళ్యాణ్ ఎందుకు తపన పడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడాలని కొందరు సీనియర్ కాపు నాయకులు ఆశిస్తుంటే… ఆయన మాత్రం చంద్రబాబును సీఎం చేయాలన్న బలమైన కోరికలో ఉన్నారని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో కాపు అభ్యర్థులను ఓడించిన చంద్రబాబును సీఎంగా చూడాలనుకోవడం సరికాదన్నారు. చిరంజీవి పి అర్ పి అభ్యర్థులను కుట్రలు, కుతంత్రాలతో ఓడించిన చంద్రబాబు వైపు పవన్ ఎందుకు మొగ్గు చూపుతున్నారు అని ప్రశ్నించారు. ప్రజారాజ్యం ఉనికిని కోల్పోవడానికి చంద్రబాబు, ఆయనకు వత్తాసు పలుకుతున్న కొన్ని మీడియా సంస్థలు కారణమని పోసాని ధ్వజమెత్తారు.
సీఎం జగన్ పాలన బాగాలేదని నిరూపిస్తే తన చెప్పుతో తానే కొట్టుకుంటాను అని పోసాని సవాల్ చేశారు. అమరావతిలో పేదల ఇళ్ల నిర్మాణానికి టిడిపి యే అడ్డంకి గా నిలిచిందని పోసాని ఆరోపించారు. జగన్ రాజకీయంగా బలపడితే లోకేష్ భవిష్యత్తు ఉండదని.. చంద్రబాబు ఇటువంటి నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అమరావతిలో ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకున్న చంద్రబాబుకు పేదల ఉసురు తగులుతుందన్నారు. చంద్రబాబు రాజకీయ నాయకుడిగా కాదు.. కనీసం ఓ మనిషిగా కూడా అంగీకరించలేమన్నారు. జగన్ కాలిగోటికి కూడా చంద్రబాబు సరితూగడంటూ పోసాని అనుచిత వ్యాఖ్యలు కొనసాగించారు.