Prashant Kishor New party :ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్..పూర్తిస్థాయిలో రాజకీయనేతగా మారిపోయారు. సుదీర్ఘకాలం వ్యూహకర్తగా దేశంలోని అనేక రాజకీయ పార్టీలకు సేవలు అందించారు. ప్రధాన పార్టీలు అధికారంలోకి రావడానికి తన వంతు చేయూతనందించారు. గత కొంతకాలంగా వ్యూహకర్త వృత్తి నుంచి బయటకు అడుగులు వేసిన ఆయన.. స్వరాష్ట్రంలో ఈరోజు రాజకీయ పార్టీని ప్రారంభించారు. దానికి జన సూరజ్ పేరును ప్రకటించారు. త్వరలో బీహార్ లో తన పార్టీ అధికారంలోకి వస్తుందని ఆకాంక్షించారు.గాంధీ జయంతి సందర్భంగా పాట్నాలో సన్నిహితుల నడుమ నూతన పార్టీ గురించి ప్రకటన చేశారు. దీంతో వచ్చే ఏడాది బీహార్ ఎన్నికల్లో మరో రాజకీయ పార్టీ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుదన్నమాట. బీహార్ లోని సాసారాం ప్రాంతానికి చెందిన ప్రశాంత్ కిషోర్ 2014 లోక్సభ ఎన్నికల్లో బిజెపి వ్యూహకర్తగా పనిచేశారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమయ్యారు. 2017లో బీహార్ ఎన్నికల సమయంలో మహా కూటమి తరుపున వ్యూహకర్తగా పనిచేశారు. ఆ ఎన్నికల్లో మహాకూటమి విజయం సాధించింది. కానీ తరువాత ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేశారు. కానీ ఆ పార్టీని గట్టెక్కించలేకపోయారు.2017లో జరిగిన పంజాబ్ ఎన్నికల్లో అమరేందర్ సింగ్ కి సలహాదారుడిగా పనిచేసి.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవగలిగారు. అటు తరువాత ఏపీలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీకి వ్యూహకర్తగా కుదిరారు. ఆ ఎన్నికల్లో వైసీపీని గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. మధ్యలో పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ గెలుపునకు కూడా దోహదపడ్డారు. 2019 ఎన్నికల తరువాత తాను ఏ రాజకీయ పార్టీకి పనిచేయని తేల్చి చెప్పారు. కానీ తరువాత నితీష్ నేతృత్వంలోని జెడియులో చేరారు. కానీ ఆ పార్టీలో ఇమడలేకపోయారు. కొద్ది రోజులకే వెనక్కి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతారని భావించారు. కానీ అనూహ్యంగా 2022 అక్టోబర్ 2 న జన సూరజ్ పేరుతో బీహార్లో పాదయాత్ర ప్రారంభించారు. సుదీర్ఘకాలం ఆ రాష్ట్రంలో పాదయాత్ర చేశారు.
* వచ్చే ఏడాది ఎన్నికలు
వ్యూహకర్తగా పనిచేసే రాజకీయాల్లోకి వచ్చారు ప్రశాంత్ కిషోర్. 2025లో బీహార్ ఎన్నికలు జరగనున్నాయి.ఇప్పటికీ అక్కడ జాతీయ పార్టీలుగా ఉన్న బిజెపి,కాంగ్రెస్ ఉన్నాయి. జెడియు తో పాటు ఆర్జెడి సైతం ప్రభావం చూపుతున్నాయి. జేడీయు నేత నితీష్ కుమార్ తరచు కూటమిలు మారుతుంటారు. తొలుత ఆర్జెడితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీష్.. తరువాత బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు.అయితే ఈసారి బీహార్ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ తో సమీకరణలు మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నితీష్ బిజెపితోనే ఉన్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్న వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి గెలిసి.. ఆ పార్టీ గ్రాఫ్ బాగుంటేనే కొనసాగే అవకాశం ఉంది. లేకుంటే మాత్రం ప్రశాంత్ కిషోర్ తో జత కలిసేందుకు కూడా వెనుకాడరు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
* నితీష్ ను ఎదుర్కోగలరా
బీహార్ ను సుదీర్ఘకాలం పాలించింది ఆర్జెడి.లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలో బీహార్లో తనకంటూ ఒక ఉనికి చాటుకుంది ఆ పార్టీ. అయితే నితీష్ ఎంట్రీ తో రాజకీయాలు మారిపోయాయి. బీహార్ కు సుదీర్ఘకాలం సీఎంగా ఆయనే వ్యవహరిస్తూ వచ్చారు. తరచూ కూటమిలను మార్చుతూ..తన సీఎం పదవిని పదిలం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు దానిపైనే దృష్టి పెట్టారు ప్రశాంత్ కిషోర్. వచ్చే ఎన్నికల్లో బీహార్లో అధికారమే ధ్యేయంగా పార్టీని ప్రారంభించారు.మరి అందులో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More