PMAY- U: భారతదేశంలోని పట్టణాలు, నగరాల్లో నివసించే పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇల్లు కల్పించాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ -2.0’అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం కొత్తగా ఇల్లు నిర్మించుకునే వారికి 2.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేయనుంది. ఇప్పటికే ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 10.73 లక్షల మందికి లబ్ధి చేకూరింది. అయితే తాజాగా ఈ పథకం ద్వారా 2.88 లక్షల కొత్త గృహాలను మంజూరు చేసింది. దీంతో మొత్తం ఇళ్ల సంఖ్య 13.61 లక్షలకు చేరింది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో దేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా మొత్తం 16 రాష్ట్రాల్లో ఈ స్కీం వర్తించనుంది.
PMAY – 2.0 పథకం కింద పట్టణాల్లో నివసించే పేదలు ఇల్లు నిర్మించుకుంటే ఒక్కో గృహానికి రూ.2.50 లక్షల ఆర్థిక సహాయం అందనుంది. భారతదేశంలోని పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. గ్రామాల నుంచి పట్టణాలకు అత్యధికంగా వలసలు రావడంతో ఇక్కడ చాలామంది అద్దె ఇళ్లపై ఆధారపడుతున్నారు. దీంతో స్లమ్ ప్రాంతాల విస్తీర్ణం పెరిగిపోతుంది. నీతో భూముల ధరలు పెరుగుతున్నాయి. ఇవన్నీ పట్టణాల్లో నివసించే పేదలకు గృహం అందని పరిస్థితిగా మారింది. ఈ లోటును తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం PMAY- U అనే పథకాన్ని ప్రారంభించింది.
Also Read: మోదీ ఇజ్రాయెల్ టూర్.. వ్యూహాత్మక మలుపు
ఈ పథకం ప్రధానంగా నాలుగు మోడళ్లలో అమలవుతుంది. ఒకటి బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్, రెండు అపార్టబుల్ హౌసింగ్ ఇన్ పార్ట్నర్షిప్, మూడు ఇన్ సీటు స్లం రీ డెవలప్మెంట్, నాలుగో క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ ద్వారా అమలు అవుతుంది. పట్టణాల్లో నివసించే పేదలకు కేటగిరీల వారీగా నిధులను కేటాయించారు. ఇందులో వెనుకబడిన వర్గాలు, మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు. మహిళలకు 1.60 లక్షలు, సీనియర్ సిటిజన్స్ 22, 581, SC వర్గానికి 35,525.. ST వర్గానికి 9,773.. OBC వారికి 82,190 ఇళ్లను మంజూరు చేయనుంది. మహిళల పేరుతో లేదా సంయుక్త పేరుతో ఇల్లు నమోదు చేయడం ద్వారా మహిళలకు ఆస్తి హక్కును పెంచడం కూడా ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది. మహిళల పేరుతో గృహాలు ఉంటే వారి నిర్ణయాధికారం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే సామాజికంగా వెనుకబడిన వారికి ఇళ్ళ కేటాయింపులు చేయడం వల్ల వారికి స్థిర నివాసాన్ని అందించినట్లు అవుతుందని చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పట్టణీకరణ వేగంగా పెరుగుతోంది. ఇక్కడ చాలామంది గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చి జీవిస్తున్నారు. దీంతో వీరికి అద్దె భారం పెరిగిపోతుంది. దీనిని అధిగమించుకునేందుకు పెద్దఎత్తున గృహాలను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.