Petrol bunks closed on Sundays: పశ్చిమ ఆసియా ప్రాంతంలో చోటు చేసుకున్న యుద్ధం ఇంకా తగ్గడం లేదు. ఇప్పటివరకు తాత్కాలికంగా కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ.. ఇది ఏ క్షణమైనా మళ్లీ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉంది. తమతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని అమెరికా ఇరాన్ మీద ఒత్తిడి తీసుకొస్తోంది. ఇరాన్ తమషరతులకు లొంగితేనే అమెరికాతో చర్చలకు సిద్ధమంటూ సంకేతాలు పంపిస్తోంది. దీంతో రెండు దేశాల మధ్య భీకరమైన వాతావరణం కొనసాగుతోంది. ఇది ఎప్పటికీ సానుకూలంగా మారుతుందో అర్థం కావడం లేదు.
ఇరాన్ గల్ఫ్ దేశాలలో ప్రధానమైనది. మన దేశానికి క్రూడ్ ఆయిల్ ఈ దేశం నుంచి కూడా వస్తూ ఉంటుంది. ఈ దేశంలో ఉన్న హార్మోజ్ జల సంధి నుంచి క్రూడ్ ఆయిల్ రవాణా అవుతూ ఉంటుంది. అయితే ఈ జల సంధి మీదుగా రవాణా అయ్యే క్రూడ్ ఆయిల్ విషయంలో ఇరాన్ షరతులు విధిస్తోంది. ఈ జల సంధి మీదుగా రవాణా అయ్యే క్రూడ్ ఆయిల్ నౌకల మీద దాడులు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది.. దీంతో మన దేశానికి అంతంతమాత్రంగా క్రూడ్ ఆయిల్ సరఫరా అవుతుంది. మన దేశ ఇంధన అవసరాలు మొత్తం దిగుమతుల మీద ఆధారపడి ఉన్నాయి. అలాంటప్పుడు క్రూడ్ ఆయిల్ సప్లై ఆగిపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పటికైతే రిజర్వ్ నిల్వలు ఉన్నప్పటికీ.. యుద్ధం వల్ల ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయో అంతు పట్టకుండా ఉంది.
ఇంధన వనరుల మీద ఒత్తిడి అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని పెట్రోలియం సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, పుదుచ్చేరి, హర్యానా రాష్ట్రాలలో ఇకపై ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు పనిచేయవు. మే 14 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. దీనివల్ల ఇంధన వనరుల మీద ఒత్తిడి తగ్గుతుందని ఇండియన్ ఆయిల్ ఫెడరేషన్ బాధ్యులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో పెట్రోల్ , డీజిల్ సరఫరాలో అంతరాయాలు చోటుచేసుకున్నాయి. దీంతో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ వాతావరణం ఏర్పడింది. అయితే గల్ఫ్ దేశాలలో పరిస్థితి ఇంతవరకు సాధారణ స్థితికి రాలేదు. ఎప్పుడు అది సాధారణస్థితికి చేరుకుంటుందో కూడా తెలియడం లేదు. అలాంటప్పుడు ఇప్పటినుంచి స్వీయ జాగ్రత్త పాటిస్తే మంచిదని ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు.
ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు మూసి ఉంటాయి కాబట్టి.. వినియోగదారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. “మే 14 నుంచి ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు మూసి ఉంచాలని నిర్ణయించాం.. ఈ నిర్ణయం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తీసుకున్నాం.. దీనివల్ల భవిష్యత్తు కాలంలో పెట్రోల్ మీద ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నాం. పునరుద్ధరించలేని వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని” ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు.