Pawan Kalyan
Pawan Kalyan: ఇంట గెలిచి.. రచ్చ గెలవాలంటారు. రాజకీయాల్లో సుదీర్ఘకాలం రాణించాలనే నాయకులు.. ముందుగా తాము ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలను ఎంచుకుంటారు. తమ శాశ్వత రాజకీయాలకు వేదికగా మలుచుకుంటారు.ఒక నాయకుడు పేరు చెబితే… ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం గుర్తొచ్చే విధంగా తయారు చేసుకుంటారు.చంద్రబాబు అంటే కుప్పం,జగన్ అంటే పులివెందుల,పెద్దిరెడ్డి అంటే పుంగనూరు నియోజకవర్గాలు గుర్తుకొస్తాయి. అంతలా ఆ నియోజకవర్గాలు వారితో పెన వేసుకున్నాయి.
అయితే తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన శాశ్వత నియోజకవర్గం పై చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో పవన్ విశాఖ జిల్లా గాజువాక తో పాటు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పోటీ చేశారు. రెండు చోట్ల ఓటమి చవిచూశారు. కానీ ఈసారి ఆ పరిస్థితి లేకుండా.. ఏదో ఒక నియోజకవర్గము నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే దీనిపై అంతర్గతంగా ఓ సర్వే చేశారు.పవన్ కు అనుకూలమైన నియోజకవర్గాలు 10 వరకు ఉన్నాయి.కానీ మిగతా నాయకులు మాదిరిగా ఒక శాశ్వత నియోజకవర్గం అవసరమని పవన్ భావిస్తున్నారు. అందుకే ఆచీతూచీ నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారు.
భీమవరం పవన్ సొంత నియోజకవర్గం. కాపు సామాజిక వర్గం అధికం. ఈ నియోజకవర్గాన్ని శాశ్వతంగా తీర్చిదిద్దుకోగలిగితే.. పవన్ రాజకీయ ప్రయోజనానికి పనికొస్తుందన్న సూచనలు ఆయనకు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో పవన్ఎనిమిది వేల ఓట్లతో ఇక్కడ ఓడిపోయారు.ఆ ఎన్నికల్లో పవన్ కి 62285 ఓట్లు వచ్చాయి. వైసీపీ తరఫున పోటీ చేసిన గ్రంధి శ్రీనివాస్ కి 70 వేల 642 ఓట్లు వచ్చాయి. టిడిపి నుంచి పోటీ చేసిన పులపర్తి రామాంజనేయులు కు 54 వేల ఓట్లు లభించాయి. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన పొత్తు కుదరడంతో.. రెండు పార్టీలకు కలిపి లక్ష 16 వేల ఓట్లు లభించే అవకాశం ఉంది.అందుకే ఈ నియోజకవర్గంలో సేఫ్ అని పవన్ కు సన్నిహితులు సూచిస్తున్నారు.దీనిని ఒక శాశ్వత నియోజకవర్గంగా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు.
పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తామంటే టిడిపి నుంచి అభ్యంతరం ఉండదు. అక్కడ టిడిపి ఇన్చార్జ్రామాంజనేయులకు చంద్రబాబు సర్థిచెప్పే అవకాశం ఉంది. ఇక్కడ పవన్ కు మార్గం సుగమం కావడం ఖాయం. పైగా పవన్ ఈ నియోజకవర్గంలో సునాయాసంగా గెలుపొందే అవకాశం ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా కూటమికి ప్రచారం చేసే వీలుంటుంది. ఇలా ఎలా చూసుకున్నా పవన్ కు భీమవరం శాశ్వత నియోజకవర్గం కానుందని తెలుస్తోంది.