
Preethi- Pawan Kalyan : మెడికో విద్యార్థి ప్రీతి మరణం అందరినీ కదిలించింది.. దిగ్బ్రాంతికి గురిచేసింది. ఎంతో భవిష్యత్ ఉన్న ఒక విద్యార్థిని ఇలా ర్యాగింగ్ భూతానికి బలి కావడాన్ని ఎవరూ తట్టుకోవడం లేదు. అందరూ ఈ దురాగతాన్ని ఖండిస్తూనే ఉన్నారు. జనసేనాని పవన్ కళ్యాన్ సైతం ఈ దారుణంపై స్పందించారు. సంచలన వ్యాఖ్యలు చేశారు.
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో చదువుతున్న పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి మరణం అత్యంత బాధాకరమని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచిన డాక్టర్ ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.
సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేక డాక్టర్ ప్రీతి బలవన్మరణానికి పాల్పడ్డ పరిస్థితులు, కన్నవారి మానసిక వేదన గురించి తెలుసుకొంటే హృదయం ద్రవించిందని పవన్ అన్నారు. తమ బిడ్డను సైఫ్ వేధిస్తూ, కించపరుస్తూ ఉన్నాడని తల్లితండ్రులు ఫిర్యాదు చేసిన వెంటనే కాలేజీ బాధ్యులు సరైన రీతిలో స్పందించి ఉంటే ఇటువంటి దురదృష్టకర పరిస్థితి వచ్చేది కాదన్నారు. డాక్టర్ ప్రీతి ఆత్మహత్యకు కారకుడైన నిందితుడికి కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్ చేశారు.
కళాశాలలో ముఖ్యంగా మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలలో ర్యాగింగ్, వేధింపులు అరికట్టడంపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంభించాలని పవన్ ప్రభుత్వానికి సూచించారు. సీనియర్ విద్యార్థుల ఆలోచన ధోరణి మారాలని.. కొత్తగా కాలేజీలోకి అడుగుపెట్టిన వారిని స్నేహపూర్వకంగా అక్కున చేర్చుకుని తమ కుటుంబ సభ్యుల్లా ఆదరించాలన్నారు. అందుకు భిన్నంగా వేధింపులకు పాల్పడటం, ఆధిపత్య ధోరణి చూపడం రాక్షసత్వం అవుతుందని గ్రహించాలన్నారు..