Pawan kalyan: సభ్య సమాజం తలదించుకునే ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. సైదాబాద్ లో ముక్కుపచ్చలారని ఆరేళ్ల బాలికపై మృగాడు అత్యాచారం చేసి హత్య చేయడం కలకలం రేపింది. వాడు ఇంతవరకూ దొరకలేదు. పోలీసుల కళ్లుగప్పి తిరుగుతూనే ఉన్నాడు. మీడియాలో, సోషల్ మీడియాలో సైదాబాద్ బాలిక గురించి కథనాలు, ఉద్యమం జరుగుతోంది.
ఇప్పటికే హీరో మంచు మనోజ్ బాలిక తల్లిదండ్రులను పరామర్శించి తన సానుభూతి వ్యక్తం చేశాడు. తాజాగా జనసేనాని, స్టార్ హీరో పవన్ కళ్యాణ్ సైదాబాద్ సింగరేణి కాలనీకి వచ్చారు.
సింగరేణి కాలనీలో బాధిత చిన్నారి తల్లిదండ్రులని పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ తరలివచ్చారు. వారి బాధలు, కష్టాలు విని చలించిపోయారు. పవన్ రాకతో అభిమానుల కోలాహలం ఎక్కువవతుండడంతో కొద్దిసేపు కారులోనే ఉన్నారు. బయటకు పోవడానికి వీలుకాకపోవడంతో పోలీసుల సహాయంతో చిన్నారి తల్లిదండ్రులని తన కార్ వద్దకి పవన్ కళ్యాణ్ పిలిపించుకుని పరామర్శించారు.
పవన్ కళ్యాణ్ వస్తున్న విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున సైదాబాద్ చేరుకున్నారు. అభిమానుల రద్దీ వల్ల పవన్ కారు దిగేందుకు కూడా సాధ్యపడలేదు. అభిమానుల తోపులాటలో స్థానికుడి కారు కూడా ధ్వంసం అయ్యింది.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన పవన్.. నిందితుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాంటి మృగాళ్లకు సభ్యసమాజంలో బతికే అర్హత లేదని ఖండించారు. పోలీస్ శాఖ వెంటనే నిందితుడిని పట్టుకోవాలని కోరారు.