గతంలో భవన నిర్మాణ కార్మికుల కోసం విశాఖపట్నం లో లాంగ్ మార్చ్ నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఎల్జీ పాలిమర్స్ బాధితుల కోసం మరో ఉద్యమానికి సిద్ధమౌతున్నట్లుగా తెలుస్తుంది. విశాఖ ఘటనపై స్పందించిన పవన్.. ప్రభుత్వం సక్రమంగా స్పందించకపోతే ఉద్యమిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విష వాయువు ప్రభావిత ప్రాంత ప్రజలకు జనసేన అండగా నిలుస్తుందన్నారు. విశాఖ జిల్లా నాయకులు, పార్టీ శ్రేణులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల ఆశలతో ప్రభుత్వం ఆడుకోకూడదని హితవు పలికారు.
సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చారని, ఇప్పుడేం చేస్తున్నారో ప్రజలు చూస్తున్నారని పవన్ అన్నారు. ఇళ్లస్థలాల విషయంలో పేదలను మభ్యపెట్టకుండా అర్హులందరికీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్తుల వేలం, అధిక విద్యుత్ బిల్లులు, మద్యం అమ్మకాలపై క్షేత్ర స్థాయి నుంచి పోరాడాలని పార్టీ శ్రేణులకు సూచించారు.