Jagan sidelines Sajjala: వైఎస్ఆర్ కాంగ్రెస్ ( YSR Congress ) పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా సాగాయి. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. జగన్ అంటే ఒక్కడు కాదు కోట్లాదిమంది అంటూ అధినేత వ్యాఖ్యానించారు. అయితే ఈ విషయాన్ని పక్కన పెడితే.. ఆయన పక్కన ఆ ఒక్కడు కనిపించకపోవడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. గత ఐదేళ్లుగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు సజ్జల రామకృష్ణారెడ్డి లేకుండా అడుగు ముందుకు వేసేవారు కాదు జగన్మోహన్ రెడ్డి. అటువంటిది ఒకరిద్దరు నేతలు.. అసలు ఉనికే లేని నాయకులతో కలిసి తాడేపల్లి కార్యాలయం వద్ద జగన్మోహన్ రెడ్డి జెండా ఎగురవేయడం పై రకరకాల చర్చ ప్రారంభం అయింది. జగన్మోహన్ రెడ్డి కొత్త టీంను వెతుక్కుంటున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డిని సైడ్ చేస్తారన్న ప్రచారానికి ఇప్పుడు బలం చేకూరుతోంది.
ప్రభుత్వంతో పాటు పార్టీలో ప్రాధాన్యం..
సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ గా( Sakshi editorial director ) ఉండేవారు సజ్జల రామకృష్ణారెడ్డి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్దగా వినిపించేది కాదు ఈ పేరు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం సజ్జల జగన్మోహన్ రెడ్డికి మరింత దగ్గరయ్యారు. ప్రభుత్వంతో పాటు పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. చివరకు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చలకు సైతం సజ్జలకు బాధ్యతలు ఇచ్చారు. ప్రభుత్వ పాలసీలు సైతం ప్రకటించడంలో సజ్జల కు స్వేచ్ఛ ఉండేది. ఆయన కుమారుడుకు సోషల్ మీడియా బాధ్యతలు కూడా కట్టబెట్టారు.. అధినేత జగన్మోహన్ రెడ్డి తరువాత అత్యంత పెద్ద పాత్ర సోషల్ మీడియా విభాగానిదే. అయితే ఇంత చేస్తే అధినేతకు తప్పుడు సలహాలు ఇచ్చి పార్టీ ఓటమికి కారణం అయ్యారన్న విమర్శ సజ్జల రామకృష్ణారెడ్డి పై ఉంది. ఆయనను తప్పించాలన్న డిమాండ్ కూడా ఉంది. అయితే ఇటీవల తాడేపల్లికి సీనియర్ నేతలు వస్తారన్న ప్రచారం నేపథ్యంలో.. సజ్జలను సైడ్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.
Also Read: వైసీపీ విధేయత.. బిజెపి ఎంజాయ్!
సీనియర్ కు బాధ్యతలు..
ఇటీవల ధర్మాన ప్రసాదరావుకు( dharmana Prasad Rao ) తాడేపల్లి బాధ్యతలతో పాటు పార్టీ రాష్ట్ర సమన్వయ బాధ్యతలు అప్పగిస్తారన్న ప్రచారం ఉంది. గత ఎన్నికల్లో ఓటమికి సజ్జల తీరు కారణమని ఎక్కువమంది సీనియర్లు అభిప్రాయపడుతూ వచ్చారు. కొంతమంది బాహటంగా వ్యాఖ్యానించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అధినేతకు నిజం చెబుతామంటే అడ్డగోడగా నిలబడి తమ నోరు నొక్కారన్నవారు ఉన్నారు. ఈ క్రమంలోనే సజ్జలను సైట్ చేసి కొత్త టీం ను ఏర్పాటు చేసే పనిలో ఉన్నారట జగన్మోహన్ రెడ్డి. ఈరోజు జరిగిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, దేవినేని అవినాష్ లాంటి వారు మాత్రమే కనిపించారు. మిగతావారు చిన్నాచితకా నాయకులు. సజ్జల కనిపించకపోయేసరికి ఇది ఆలోచించాల్సిన విషయమే అనే కామెంట్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.