Pawan Kalyan- Chandrababu Alliance: అవసరం ఎంత పనైనా చేయిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి అంతే. విశాఖ పవన్ పర్యటనను అడ్డుకోవడం, జనసేన శ్రేణులపై కేసులు తదితర పరిణామాల క్రమంలో పవన్ ను పరామర్శించేందుకు చంద్రబాబు సిద్ధపడడం వెనుక అవసరమన్న మాట ఉంది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ గడ్డు కాలం. దీనికి పవన్ తోడైతేనే ఆ పార్టీ బయటపడేది. లేకుంటే అంతే సంగతులని రాజకీయ విశ్లేషకులు ఏనాడో తేల్చేశారు. అయితే ఎటువంటి క్లిష్ట పరిస్థితులనైనా తట్టుకునే శక్తి చంద్రబాబుకు ఉంది. అందుకే వైసీపీ నుంచి దారుణ చర్యలను ఎదుర్కొంటున్నా ఆయన సహనంతో వ్యవహరిస్తూ వచ్చారు. కానీ దీటుగా ఎదుర్కోలేకపోతున్నారు. ఇటువంటి తరుణంలో చంద్రబాబుకు వపన్ కళ్యాణ్ ఆశాదీపంగా మారారు. తనంతలా కాకున్నా వైసీపీ సర్కారు బాధితుడు కావడంతో సంఘీభావం తెలపడానికి పవన్ ఎదురుగా వాలిపోయారు.

అయితే వారి మధ్య ప్రస్తుతానికి రాజకీయ చర్చలు జరిగినా.. పొత్తుల అంశం మాత్రం చర్చకు రాలేదు. కానీ ఇప్పుడు పొత్తులు కుదిరిపోయాయంటూ కథనాలు, ప్రచారాలు వెలువడుతున్నాయి. భేరసారాల అనంతరం చంద్రబాబు 40 సీట్ల వద్దకు వచ్చి నిలిచిపోయారన్న ప్రచారం చక్కెర్లు కొడుతోంది. అయితే ఇందులో వాస్తవమెంత అన్నది మాత్రం బయటకు పొక్కడం లేదు. అయితే పొత్తు ఇంకా పొడవకపోయినా.. చంద్రబాబు దూరదృష్టితో ఆలోచిస్తున్నట్టున్నారు. చాలా నియోజకవర్గాలను ఖాళీగా ఉంచుతున్నారు. తన పార్టీకి బలమైన అభ్యర్థులన్న చోట సైతం రిజర్వు చేసి పెట్టారు. ఇటీవల చంద్రబాబు నియోజకవర్గాల రివ్యూకి శ్రీకారం చుట్టారు. కొందరి పనితీరును మెచ్చి.. ఎటువంటి వివాదాలు లేని నియోజకవర్గాల్లో నేతలను పనిచేసుకోవాలని పురమాయిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులు మీరేనంటూ.. నియోజకవర్గాల్లో పనిచేసుకోవాలని చెప్పి పంపిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాలను మాత్రం పెండింగ్ లో పెడుతున్నారు. అటువంటవన్నీ జనసేన కోసమేనన్న టాక్ అయితే నడుస్తోంది.
ప్రధానంగా కాపులు, మెగా ఫ్యాన్స్ యాక్టివ్ గా ఉన్న చాలా స్థానాలను జనకోసమేనన్నట్టు చంద్రబాబు విడిచిపెడుతున్నారు. అటువంటి వాటిలో విజయవాడ పశ్చిమం, కైకలూరు, అవనిగడ్డ తదితర నియోజకవర్గాలున్నాయి.ఇప్పటివరకూ ఇన్ చార్జులను నియమించలేదు. దీనిపై నేతలకు కూడా చంద్రబాబు స్పష్టతనివ్వలేదు. భీమవరం, నరసాపురం, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, పోలవరం, చింతలపూడి, కాకినాడ రూరల్, అమలాపురం, రాజోలు, పి,గన్నవరం, విశాఖ ఉత్తరం, భీమిలి నియోజకవర్గాలను చంద్రబాబు పెండింగ్ లో పెట్టారు. అయితే ఈ నియోజవర్గాల్లో బలంగా ఉన్నట్టు పవన్ కూడా చెబుతున్నారు.చంద్రబాబు ఖాళీగా విడిచిపెడుతుండడంతో జనసేన కు కేటాయించే నియోజకవర్గాలివేనంటూ ప్రచారం జోరుగా సాగుతోంది.

అయితే దాదాపు జనసేన 50 నియోజకవర్గాల్లో గెలుపుబాటలో ఉన్నట్టు సర్వే నివేదికలు వచ్చాయి. అయితే ఇందులో టీడీపీ బలమైన నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు సైతం ఉండడం విశేషం.మొత్తానికైతే జనసేన గెలిచే స్థానాలపై టీడీపీ అధినేత చంద్రబాబకు ఒక క్లారిటీ వచ్చారని తెలుస్తోంది. అయితే చంద్రబాబు ఏంచేసినా ఒక పద్ధతి ప్రకారం చేస్తారు. తొలుత వన్ సైడ్ లవ్ అంటూ పొత్తు అంశం తెరపైకి తెచ్చారు. దానికి విస్తృత ప్రచారం కల్పించారు. అటు తరువాత మహానాడుతో జోష్ పెరిగిందని.. తమకు ఎవరితోనూ పొత్తు అవసరం లేదని సొంత పార్టీ శ్రేణులతో చెప్పించారు. ఇప్పుడు కొత్తగా జనసేనకు అన్ని ఇన్ని నియోజకవర్గాలంటూ లీకులు వదులుతున్నారు. ప్రస్తుతానికైతే 40 నియోజకవర్గాలు… ఎన్నికలనాటికి 70కి మించినా ఆశ్చర్యపోనవసరం లేదని జనసేన వర్గాలు చెబుతున్నాయి.