Odisha Viral Incident: పశువులను ( animals) అక్రమంగా రవాణా చేస్తున్నారంటూ ఓ ఇద్దరి విషయంలో ఆ గ్రామస్తులు అమానుషంగా ప్రవర్తించారు. అర గుండు చేయించి, మురుగునీరు తాగించి వేధింపులకు గురిచేశారు. గ్రామమంతా వారితో మోకాళ్లపై నడిపించారు. ఈ ఘటన ఒడిస్సా లో జరిగింది. ఏపీకి కూతవేటు దూరంలో ఉన్న గంజాం జిల్లాలో జరిగింది ఈ ఘటన. గ్రామం నుంచి కొద్ది రోజులుగా గోవుల అక్రమ రవాణా సాగుతోంది. చివరకు దూడలను సైతం కబేలాలకు తరలిస్తున్నారు. ఈ తరుణంలో గ్రామస్తులు స్పందించారు. పశువుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారంటూ ఇద్దర్ని దేహ శుద్ధి చేశారు. అంతటితో ఆగకుండా అమానుష చర్యలతో వారిని ఇబ్బందులు పెట్టారు.
పశువులు కొనుగోలు చేసి తీసుకెళ్తుండగా
గంజాం జిల్లా( Ganjam district ) ధారా కోట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆదివారం హరిపూర్ లోని ఓ వ్యక్తి నుంచి ఓ ఆవు, రెండు దూడలు కొనుగోలు చేసి వాటిని నడిపించుకుంటూ సొంతూరు బయలుదేరారు. కారిగుమ్మ వద్ద ఓ పదిమంది వారిని అడ్డుకున్నారు. జంతువులను అక్రమంగా రవాణా చేస్తున్నారని ఆరోపించారు. బలవంతంగా వారి వద్ద సొమ్ము తీసుకునేందుకు ప్రయత్నించగా బాధితులు ప్రతిఘటించారు. దీంతో వారు ఆ ఇద్దరినీ చితకబాదారు. అనంతరం అర గుండు కొట్టించి.. రెండు కిలోమీటర్ల మేర నడిపించుకుంటూ తీసుకువచ్చారు.
వీధిలో ఊరేగించి
అయితే వారిపై దాడికి పాల్పడుతున్న ఏ ఒక్కరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో వారు మరింత రెచ్చిపోయారు. ఆ ఇద్దరితో మురుగు కాలువ నీరు బలవంతంగా తాగించారు. వీధుల్లో మోకాళ్లపై నడిపించారు. వారి నుంచి బాధితులు ఎలాగోలా తప్పించుకున్నారు. సొంత గ్రామంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తలతో పాటు వీపులపై గాయాలు ఉండడంతో పోలీసులు వారిని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటన ఒరిస్సా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రభుత్వం సైతం సీరియస్గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.