New Traffic Rules: రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా.. ఎన్ని కఠిన నిబంధనలు విధించినా ప్రమాదాలు తగ్గడం లేదు. వివిధ కారణాలతో వాహనదారులు రూల్స్ అతిక్రమిస్తున్నారు. జరిమానా విధించినా తప్పించుకు తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో జరిమానా వసూలుతోపాటు వాహనదారుల్లో మార్పు కోసం మరికొన్ని కఠిన నిబంధనలు తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. మోటారు వెహికిల్స్ రూల్స్–1989లో కేంద్రం ప్రతిపాదించిన సవరణలు రవాణా నియంత్రణలో కొత్త పద్ధతులను తీసుకురావడం లక్ష్యంగా ఉన్నాయి. ఇప్పటి వరకు చలాన్ చెల్లించడానికి ఇచ్చిన 90 రోజుల గడువును 45 రోజులకు తగ్గించాలని నిర్ణయించారు. నిర్ణీత గడువులో చెల్లించని వాహనాలు సీజ్ చేసే అధికారం అధికారులకు లభించనుంది.
ఐదు చలాన్లకంటే ఎక్కువైతే..
కొత్త నిబంధనల ప్రకారం ఐదుకుపైగా ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదైతే డ్రైవింగ్ లైసెన్స్ తాత్కాలికంగా రద్దు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. తరచూ నిబంధనలు అతిక్రమించే డ్రైవర్లను నియంత్రించడానికి ఇది సమర్థమైన చర్యగా భావిస్తున్నారు.
చలాన్ బకాయిలు ఉంటే..
చలాన్ చెల్లింపులో ఆలస్యం జరిగితే, ఆ వాహనంపై ఏ రకమైన రిజిస్ట్రేషన్, బీమా లేదా విక్రయ లావాదేవీలు చేయడం సాధ్యంకాదని తాజా ముసాయిదా నిబంధనలు చెబుతున్నాయి. ఇది చట్టం సక్రమంగా అమలుకు దోహదం చేస్తుంది.
ఉల్లంఘనకు 3 రోజుల్లో నోటీసు
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను ఇప్పటి కంటే వేగంగా పరిష్కరించేందుకు, ఘటన చోటు చేసుకున్న మూడు రోజుల్లోపు నోటీసు జారీ చేయడం తప్పనిసరి కానుంది. ఈ చర్యతో వ్యవస్థ పారదర్శకంగా, సమయపాలనతో నడవడం సులభమవుతుంది.
అభిప్రాయాలు కోరిన కేంద్రం
ప్రతిపాదనలు తుది రూపం దాల్చే ముందు, వీటిపై ప్రజల అభిప్రాయాలను స్వీకరించాలని కేంద్రం నిర్ణయించింది. సూచనలు లేదా అభ్యంతరాలు ఉన్నవారు రవాణాశాఖ అదనపు కార్యదర్శికి పంపించవచ్చని తెలిపింది.
రోడ్డుపై క్రమశిక్షణ పెంచడం, ట్రాఫిక్ ఉల్లంఘనలు తగ్గించడం కొత్త నిబంధనల ప్రధాన లక్ష్యం. వాహనదారుల్లో చట్టపరమైన అవగాహన, బాధ్యత పెంచడం ద్వారా ప్రమాదాల శాతం తగ్గించాలనే ప్రభుత్వ ఆశయం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే, ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థ కఠినతరం కావడంతోపాటు, నగరాల్లో క్రమశిక్షణ గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.