Political Meetings: సభలు, సమావేశాలకు జనాలు స్వచ్చందంగా వెళ్లే రోజులు ఏనాడో కనుమరుగయ్యాయి. ఇప్పుడంతా బలవంతపు జన సమీకరణలు అందరికీ తెలిసిందే. చివరకు భారీగా డబ్బులు వెదజల్లితే కానీ జనం రాని దుస్థితి నెలకొంది. ఇక ప్రభుత్వ, అధికారిక సమావేశాలకు అయితే జనం ముఖం చాటేస్తున్నారు. దీంతో వారిని నయానో..భయానో దారికి తెచ్చుకుంటున్నారు. సభలు, సమావేశాలు విజయవంతం చేసుకుంటున్నారు. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. ముఖ్యంగా సీఎంలు పాల్గోనే సమావేశాలకు జన సమీకరణలో అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. జనాన్ని సమీకరించలేక ఇబ్బందిపడుతున్నారు. పలానా చోట సీఎం సమావేశముంటుందని ఉన్నతాధికారుల నుంచి సమాచారం రాగానే బెంబేలెత్తిపోతున్నారు. సదరు సమావేశం విజయవంతం చేసే బాధ్యత అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తీసుకోవడం లేదు. అంతా స్థానిక యంత్రాంగంపైనే పెడుతున్నారు.
ఏపీలో ఎక్కువగా..
ఏపీలో అయితే ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. గత మూడేళ్లుగా సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితమైపోయారన్న కామెంట్లు వినిపించాయి. అక్కడ నుంచే మీట నొక్కుతూ సంక్షేమ పథకాలను ప్రారంభించేవారు.అయితే పథకాలకు ఆశించిన స్థాయిలో మైలేజ్ రావడం లేదనో.. లేక ప్రజల మధ్యకు రావాలన్న ప్రయత్నమో కానీ ఇప్పుడు ఆయన జిల్లాల పర్యటన మొదలెట్టేశారు. ఏదో ఒక జిల్లా నుంచి మీట నొక్కడం ప్రారంభించారు. అయితే ఆయన సమావేశాలకు జనం ముఖం చాటేస్తున్నారు. హాజరు అంతంతమాత్రమే. దీంతో జనాల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ప్రజాప్రతినిధులకు దాపురించింది. సరైన సదుపాయాలు లేకపోవడం, ఆరోజు ఇతర పనులు ఉండడం, వ్యవసాయ సీజన్ పనులు ఉండడం తదితర కారణాలతో జనాలైతే రావడం లేదు. దీంతో ఇది మీడియాలో ప్రముఖంగా వస్తుండడంతో ప్రభుత్వానికి డ్యామేజీ అవుతోంది. జగన్ సభలకు జనాలు రావడం లేదన్న టాక్ ప్రారంభమైంది. దీంతో ప్రభుత్వ పెద్దలు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీఎం సమావేశాలకు స్వయం సహాయ సంఘాల సభ్యులకు తరలించడం ప్రారంభించారు.
Also Read: Director Bobby Father : దర్శకుడు బాబి (కే.ఎస్. రవీంద్రనాథ్)కు పితృవియోగం
ముఖం చాటేస్తున్న జనం..
గత కొద్దిరోజులుగా జిల్లాల నుంచి సంక్షేమ పథకాలను సీఎం జగన్ ప్రారంబిస్తున్నారు. 13 జిల్లాల్లో ఒక్కో పథకాన్ని ఒక్కో జిల్లా నుంచి సీఎం మీట నొక్కుతున్నారు. దీంతో జన సమీకరణ యంత్రాంగానికి కత్తిమీద సాములా మారింది. దీంతో అన్ని శాఖల అధికారులు డ్వాక్రా సంఘాలపై పడింది. అధికారులు వారిని బలవంతంగా సీఎం సమావేశాలకు తీసుకెళుతుండడం కనిపిస్తోంది. ఈ క్రమంలో వారిని బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడం వంటి వాటికి సంబంధించి ఆడియో, వీడియో సందేశాలు సోషల్ మీడియాలో వెలుగుచూస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇటువంటివి వివాదాస్పదంగా మారాయి. విపక్షాలకు ప్రచార అస్త్రంగా మారాయి. అయినా సభలు, సమావేశాలు విజయవంతం చేసుకోవడానికి ప్రభుత్వం బలవంతపు జన సమీకరణ విషయంలో బెట్టు వీడడం లేదు.
తెలంగాణలో అదే సీన్..
అయితే ఇప్పటివరకూ ఏపీలో ఉన్న సంస్కృతి ఇప్పుడు తెలంగాణకు పాకింది. రంగారెడ్డి జిల్లాలో కలెక్టరేట్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్ సభకు హాజరుకావాలని డ్వాక్రా సంఘాల సభ్యలకు అధికారుల నుంచి గట్టి హెచ్చరికలే వచ్చాయి. కార్యక్రమానికి హాజరుకాకుంటే రుణాలు రావని.. ఎన్నికల సమయంలో రాయితీలు అందవని కూడా వారి గ్రూపుల్లో అధికారుల హెచ్చిరికలు వెలుగుచూడడం హాట్ టాపిక్ గా మారింది. కార్యక్రమానికి హాజరుకాని వారు రూ.500 ఫైన్ సైతం కట్టాల్సి ఉంటుందని సైతం కొందరు అధికారులు హెచ్చరించారట. సోషల్ మీడియాలో ఇది ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. విపక్షాలు కూడా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే దీనిపై అధికార టీఆర్ఎస్ నేతలు ఎలా రియాక్టవుతారో చూడాలి మరీ.
Also Read:Noida Twin Towers: నోయిడా ట్విన్ టవర్స్ ఎందుకు కూల్చేస్తున్నారు? దాని వెనుక అసలు కారణాలేంటి?
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More