NCERT Panel: ఇండియా స్థానంలో భారత్.. ఎన్సీఈఆర్టీ కూడా పుస్తకాలు మార్చేసిందిగా..

ఇండియా స్ధానంలో పాఠ్యపుస్తకాల్లో భారత్‌ పేరు వాడేలా నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌(ఎన్‌సీఈఆర్‌టీ) ప్యానెల్‌ చేసిన ప్రతిపాదనను దాని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో ఇకపై ముద్రించే పుస్తకాల్లో ఇండియా స్థానంలో భారత్‌ పేరు కనిపించనుంది.

Written By: Bhaskar, Updated On : October 25, 2023 6:14 pm

NCERT Panel

Follow us on

NCERT Panel: దేశం పేరు మార్పుపై కొన్నినెలలుగా చర్చ జరుగుతోంది. ఇండియా పేరును భారత్‌గా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు అంతర్జాతీయ, జాతీయ వేదికలపై వాడేస్తోంది. ఇండియా పేరుకు మరో పేరుగా భారత్‌ను అభివర్ణిస్తూ ఇలా అన్ని చోట్లా వాడుతోంది. దీంతో ఇప్పుడు జాతీయ సంస్థలు కూడా తమ వాడుకలో ఇండియా పేరు స్ధానంలో భారత్‌ గా పేరు మార్చుకుంటున్నాయి. అయితే ఇండియాలోనూ మార్పు క్షేత్రస్థాయయి నుంచి రావాడని భావించిన కేంద్రం.. ఈ మేరకు విద్యార్థి దశ నుంచి పిల్లల్లో ఇజెక్ట్‌ చేయాలని నిర్ణయించింది. ఈమేరకు హైస్కూల్, ఉన్నత విద్యా స్ధాయిలో పుస్తకాలు ముద్రిస్తున్న జాతీయ విద్యాశిక్షణ, పరిశోధన మండలి ఎన్‌సీఈఆర్‌టీ కూడా ఇప్పుడు అదే బాట పట్టింది.

ఏకగ్రీవ తీర్మానం..
ఇండియా స్ధానంలో పాఠ్యపుస్తకాల్లో భారత్‌ పేరు వాడేలా నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌(ఎన్‌సీఈఆర్‌టీ) ప్యానెల్‌ చేసిన ప్రతిపాదనను దాని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో ఇకపై ముద్రించే పుస్తకాల్లో ఇండియా స్థానంలో భారత్‌ పేరు కనిపించనుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ముద్రించే పుస్తకాల్లో తాజా మార్పును అమలు చేసే దిశగా ఎన్‌సీఈఆర్‌టీ అడుగులేస్తోంది.

జీ20 సదస్సు సందర్భంగా తొలిసారి..
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జరిగిన జీ20 సదస్సుతోపాటు ఆసియాన్‌ సదస్సు, ఇతర సందర్భాల్లో ఇండియా పేరుకు బదులు భారత్‌ పేరుతో అతిథులకు ఆహ్వానాలు పంపింది. దీంతో వారంతా ఆశ్చర్యపోయారు. అయితే ఇండియా పేరుకు బదులుగా భారత్‌ అనే పేరు అప్పటికే పలు చోట్ల వాడుకలో కూడా ఉండటంతో ప్రభుత్వం చేసిన మార్పును పెద్దగా పట్టించుకోలేదు. అయితే కేంద్రం ఆ తర్వాత పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో ఈ మేరకు బిల్లు ప్రవేశపెడుతుందని ఊహాగానాలు వచ్చినా అలా జరగలేదు.

భారత్‌ పేరు అలవాటు చేయాలని..
ఇప్పుడు క్షేత్రస్థాయి నుంచే భారత్‌ పేరు అలవాటు చేయాలని ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లో ఈ మేరకు ఇండియా పేరును భారత్‌ గా వాడుకునేందుకు ఆమోద ముద్ర వేయడంతో దీనిపై చర్చ జరుగుతోంది. కేంద్రం అధికారికంగా ఇండియా పేరుకు బదులు భారత్‌ గా వాడాలంటూ ఎక్కడా ఆదేశాలు ఇవ్వకపోయినా ఎన్‌సీఈఆర్‌టీ ప్యానెల్‌ ఇలా నిర్ణయం తీసుకోవడంపై చర్చ జరుగుతోంది.