ఆర్.నారాయణమూర్తి అంటే తెలియని తెలుగు సినీ ప్రేక్షకుడు ఉంటాడా. తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలంలోని మల్లంపేట గ్రామంలో ఒక పేదరైతు కుటుంబంలో జన్మించిన ఆయన 5వ తరగతి వరకు చదివాడు. రౌతులపూడిలో ఒక సినిమా థియేటర్ ఉండేది. చిన్నతనం నుండి సినిమాలలో ఆసక్తితో ఎన్టీయార్, నాగేశ్వరరావుల సినిమాలు చూసి, విరామ సమయంలో వారిని అనుకరించేవాడు. ముందు నుంచీ నారాయణమూర్తికి హీరో కావాలనే ఆశ ఉండేదట. అదే ఆశతో ప్రయత్నాలు మొదలు పెట్టగా మొదట్లో చిన్నచిన్న పాత్రలు వచ్చాయి.
Also Read: స్టార్ హీరో భారీ డిమాండ్.. బాధలో నిర్మాతలు !
సామాన్య ప్రజలకు జరిగే అన్యాయాలను గమనించి, విప్లవ ఉద్యమాలవైపు ఆకర్షితుడయ్యాడు. దీంతో ఆయనే నిర్మాతగా మారి సినిమాలు నిర్మించడం ప్రారంభించాడు. అయితే.. ఎప్పుడు అడిగినా తన జీవితం సినిమాలకే అంకితం అని అంటుంటాడు. రాజకీయాల్లోకి వస్తారా అని అడిగితే ఆ ఆలోచనే లేదని చెబుతున్నాడు.
ఒకవేళ తాను రాజకీయాల్లోకి రావాల్సి వస్తే ముందుగా మీడియాకే చెబుతానని అన్నారు. స్వగ్రామమైన రౌతులపూడి మండలం మల్లంపేటలో మంగళవారం ఆయన పర్యటించారు. రామాలయంలో స్థానికులతో మాట్లాడారు. ఆలయ కమిటీ ఏర్పాటు నిమిత్తం గ్రామస్తులతో సమావేశమయ్యారు.
Also Read: ఓటీటీలో సినిమా ప్లాప్ అయితే డబ్బులు వెనక్కి?
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనకు కాకినాడ ఎంపీగా పోటీ చేయమని నాలుగు సార్లు అవకాశం వచ్చిందని, వైఎస్ రాజశేఖర్రెడ్డి తనను తుని ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నారని తెలిపారు. కానీ.. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, మరో నాలుగు సినిమాలు తీసి డబ్బు సంపాదించి, భారతదేశమంతా పర్యటించాలని ఉందన్నారు. అనంతరం చిన్న ఇల్లు నిర్మించుకుని శేష జీవితం గడుపుతానని చెప్పారు. కరోనా ప్రభావం తగ్గగానే తన కొత్త సినిమా యూనివర్సిటీ షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. కరోనా నేపథ్యంలో నారాయణమూర్తి తల్లికి దూరం నుంచే నమస్కారం చేశారు.