AP New Disticts: కొత్త జిల్లాల ప్రకటన ఇలా వచ్చిందో లేదో.. అలా డిమాండ్లు మొదలయ్యాయి. తమ ప్రాంత, భాష, సంస్కృతి కోసం పాటుపడ్డ వారి పేర్లను కొత్త జిల్లాలకు పెట్టాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మహానుభావుడు ఎన్టీఆర్ పుట్టిన కృష్ణా జిల్లాకు ఆయన పేరు పెట్టేసి పక్క పార్టీ అధ్యక్షుడు అయినా సరే జగన్ మంచి మనసు చాటుకున్నాడు. రాజకీయాలు తనకు లేవని నిరూపించారు. ఇక అనంతపురంలో ‘హిందూపురం’ పార్లమెంట్ కు ‘సత్యసాయి’ జిల్లా పుట్టపర్తి కేంద్రంగా చేసి ప్రకటించి దైవభక్తిని చాటుకున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును విశాఖ ఏజెన్సీ జిల్లాకు పెడుతున్నాడు.
అయితే ఇంత పక్కా ప్రణాళికతో జగన్ వెళుతున్నా సరే స్థానికంగా మరికొన్ని డిమాండ్లు మొదలయ్యాయి. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఈ డిమాండ్ ను లేవనెత్తారు. ఈ క్రమంలోనే ఒక సీఎం జగన్ కు ఒక లేఖ రాశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్పు చేస్తున్నారని తెలిసిందని.. నాదొక చిన్న మనవి అని జగన్ కు రాసిన లేఖలో ముద్రగడ కోరారు. దయచేసి అవకాశం ఉంటే ఈ పెద్దల పేర్లను పలు జిల్లాలకు పెట్టాలని .. వీటిని పరిశీలించాలని పలు జిల్లాలకు పేర్లను సూచించాడు ముద్రగడ..
ఈ క్రమంలోనే తూర్పు లేదా పశ్చిమ గోదావరిలో ఒక జిల్లాకు ‘డా.బీఆర్ అంబేద్కర్’ పేరు పెట్టాలని సూచించారు. ఇక తెలుగు వారి ఖ్యాతిని నలుదిశలా చాటిన శ్రీకృష్ణదేవరాయులు పేరు ఏదో ఒక జిల్లాకు పెట్టాలని ముద్రగడ సూచించాడు.
ఇక ఏపీ నుంచి లోక్ సభ స్పీకర్ స్థాయికి ఎదిగి హెలిక్యాప్టర్ ప్రమాదంలో మరణించిన లోక్ సభ స్పీకర్ స్వర్గీయ బాలయోగి గారి పేరును కోనసీమకి పెట్టాలని సూచించారు.
మరి స్వచ్ఛందంగా జిల్లాలకు ఆయా స్థానిక దిగ్గజాల పేర్లు పెట్టిన జగన్.. ముద్రగడ ప్రతిపాదించిన వీరి పేర్లు పెడుతారా? లేదా? అన్నది వేచిచూడాలి. ముద్రగడ ప్రతిపాదించిన వాటిల్లో మూడు కూడా విలువైన సూచనలే కావడంతో వీటిని పాటిస్తాడా? లేదా? అన్నది చూడాలి.