అర్జంటుగా ఆ ఆఫీసర్లకు పోస్టింగులు..: ఏపీలో అసలేం జరుగుతోంది..?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పుడు కొత్త చిక్కుల్లో పడినట్లయింది. ఇన్నాళ్లు చంద్రబాబు హయాంలో కీలకంగా ఉన్నారనో.. లేదా నచ్చని సామాజికవర్గానికి చెందినవారనో చాలా మంది ఆఫీసర్లను దూరంగా ఉంచారు. పోస్టింగ్‌లు ఇవ్వలేదు. అయితే.. ఇప్పుడు జగన్‌ హయాంలో వారందరికీ అర్జంట్‌గా పోస్టింగ్‌లు ఇవ్వాల్సి వస్తోంది. అంతేకాదు.. ప్రమోషన్లు కూడా ఇస్తున్నారు. దీనికి కారణం వారందర్నీ ఎస్‌ఈసీ విధుల్లోకి తీసుకుని ఎన్నికల పనులు చెబుతారోనన్న భయమే. తాజాగా రవిచంద్ర అనే ఐఏఎస్ అధికారి ఖాళీగా ఉన్నారు. ఎస్‌ఈసీ కార్యదర్శిగా ఉన్న […]

Written By: Srinivas, Updated On : January 29, 2021 12:47 pm
Follow us on


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పుడు కొత్త చిక్కుల్లో పడినట్లయింది. ఇన్నాళ్లు చంద్రబాబు హయాంలో కీలకంగా ఉన్నారనో.. లేదా నచ్చని సామాజికవర్గానికి చెందినవారనో చాలా మంది ఆఫీసర్లను దూరంగా ఉంచారు. పోస్టింగ్‌లు ఇవ్వలేదు. అయితే.. ఇప్పుడు జగన్‌ హయాంలో వారందరికీ అర్జంట్‌గా పోస్టింగ్‌లు ఇవ్వాల్సి వస్తోంది. అంతేకాదు.. ప్రమోషన్లు కూడా ఇస్తున్నారు. దీనికి కారణం వారందర్నీ ఎస్‌ఈసీ విధుల్లోకి తీసుకుని ఎన్నికల పనులు చెబుతారోనన్న భయమే.

తాజాగా రవిచంద్ర అనే ఐఏఎస్ అధికారి ఖాళీగా ఉన్నారు. ఎస్‌ఈసీ కార్యదర్శిగా ఉన్న వాణీమోహన్ పని చేయడానికి సంశయిస్తుండటంతో ఆమెను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఆమె స్థానంలో మరొకర్ని నియమించాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఖాళీగా ఉన్న ఐఏఎస్‌లలో ఒకరైన రవిచంద్రను ఎస్‌ఈసీ కార్యదర్శిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియమించారు. ఆయన ఉత్తర్వుల్లో కూడా అదే పేర్కొన్నారు. ఖాళీగా ఉన్నారని నియమించానని స్పష్టం చేశారు.

అయితే.. రవిచంద్ర ఎస్‌ఈసీ కార్యదర్శిగా వెళ్తే తమకు ఇబ్బందులు వస్తాయని అధికారపక్షం అనుకుందో లేకపోతే ఎస్‌ఈసీ కోరుకున్న వారిని ఇవ్వకూడదని అనుకుందో కానీ.. వెంటనే రవిచంద్రకు టీకా పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం. టీకా వ్యవహారాలను పర్యవేక్షించే పోస్ట్ ఆయనకు అప్పజెప్పేశారు. నిజానికి ఆ పోస్టు లేకున్నా సృష్టించి మరీ పోస్టింగ్ ఇచ్చారు. ఇంతకాలం ఖాళీగా పెట్టిన అధికారికి ఒక్కసారే రెండు పోస్టులివ్వడం గమనార్హం. రవిచంద్రను అలా నియమించి మీకు కావాలంటే వీరిలో నుంచి తీసుకోండి అంటూ ముగ్గురి పేర్లను ఎస్‌ఈసీకి పంపింది.

ఒక్క రవిచంద్ర విషయంలోనే కాదు మాజీ డీజీపీ ఆర్పీఠాకూర్‌కు మంచి పోస్టింగ్ రావడానికి ఐజీ సంజయ్‌కు ఇంతకాలం ఆగిన ప్రమోషన్ వెంటనే రావడానికి కూడా పంచాయతీ ఎన్నికలే కారణమని అధికార వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మరికొంత మంది ఖాళీగా ఉన్నతాధికారులకు పోస్టింగ్‌లు ఇస్తోంది. వారంతా వివిధ సమీరణాల రీత్యా ప్రతిపక్షానికి సన్నిహితులని అధికార పార్టీ భావన. ఇప్పుడు వారి ఎన్నికల విధుల్లోకి వెళ్తే ఇబ్బందులు ఎదురవుతాయని అనుమానిస్తున్నారు. అందుకే పోస్టింగ్‌లు ఇచ్చేస్తున్నారు.