Homeజాతీయ వార్తలుMonsoon Travel: వర్షా కాలంలో తప్పనిసరిగా చూడాల్సిన ఈ 4 ప్రదేశాలు.. ఎంజాయ్ మిస్ కాకండి

Monsoon Travel: వర్షా కాలంలో తప్పనిసరిగా చూడాల్సిన ఈ 4 ప్రదేశాలు.. ఎంజాయ్ మిస్ కాకండి

Monsoon Travel: వర్షాకాలం ప్రకృతికి కొత్త అందాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో పచ్చని కొండలు, మేఘాల మధ్య జలపాతాలు, చల్లని వాతావరణం ఏర్పడుతుంది. ఇన్నాళ్లు వేసవి వేడిలో విసిగిపోయిన వారు ఇక్కడి వెళ్లి హాయిగా గడపొచ్చు. అలాంటి ప్రదేశాలు మన దేశంలో చాలా వరకు ఉన్నాయి. అయితే ఈ మాన్ సూన్ లో ట్రిప్ కు అనువైన ప్రదేశాల్లో కొన్ని అద్భుతం అని అనిపిస్తాయి. అలాంటి వాటిలో ఈ 4 ముఖ్యమైనవి. హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎలా వెళ్లాలో తెలుసుకుందాం..

టీ తోటల స్వర్గం..మున్నార్:
కేరళలోని మున్నార్ మాన్‌సూన్ సీజన్‌లో మరింత అందంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా పచ్చని టీ తోటలు, పొగమంచుతో కప్పుకున్న కొండలు, జలపాతాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఎరవికుళం నేషనల్ పార్క్, మాట్టుపెట్టి డ్యామ్, టాప్ స్టేషన్ వంటి ప్రదేశాలు ప్రత్యేక ఆకర్షణలు. వర్షాల్లో ఇక్కడి ప్రకృతి అందాలు మరింత మెరుగ్గా కనిపిస్తాయి. హైదరాబాద్ నుంచి కొచ్చి వరకు విమానంలో వెళ్లి, అక్కడి నుంచి సుమారు 130 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో టాక్సీ లేదా బస్సులో మున్నార్ చేరుకోవచ్చు. రైలులో ప్రయాణించేవారు ఎర్నాకుళం స్టేషన్ వరకు వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గాన్ని ఎంచుకోవచ్చు.

కాఫీ తోటల అందాలకు కేరాఫ్..కూర్గ్:
భారతదేశంలోని అత్యంత అందమైన హిల్ స్టేషన్లలో కర్ణాటక రాష్ట్రంలోని కూర్గ్ ఒకటి. వర్షాకాలంలో ఇక్కడి కాఫీ తోటలు, పచ్చని కొండలు, అబ్బే ఫాల్స్ వంటి జలపాతాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ప్రశాంత వాతావరణం, ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునేవారికి ఇది ఉత్తమ ఎంపిక. ఇక్కడికి వెళ్లాలని అనుకునేవారు హైదరాబాద్ నుంచి మైసూరు లేదా బెంగళూరు వరకు రైలు, బస్సు లేదా విమానంలో వెళ్లవచ్చు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కూర్గ్ చేరుకోవచ్చు. బెంగళూరు నుంచి కూర్గ్ దూరం సుమారు 260 కిలోమీటర్లు.

అద్భుతమైన జలపాతం..లోనావాలా..:
మహారాష్ట్రలోని లోనావాలా మాన్‌సూన్ టూరిజానికి ప్రసిద్ధి చెందింది. వర్షాకాలంలో ఇక్కడి లోయలు, పచ్చని కొండలు, చిన్న పెద్ద జలపాతాలు అద్భుతంగా కనిపిస్తాయి. ట్రెక్కింగ్, ఫోటోగ్రఫీ, ఫ్యామిలీ ట్రిప్స్‌కు ఇది మంచి గమ్యస్థానం. టైగర్ పాయింట్, భూషి డ్యామ్, రాజమాచి ఫోర్ట్ వంటి ప్రదేశాలు తప్పక చూడాల్సినవి. హైదరాబాద్ నుంచి పుణె లేదా ముంబై వరకు రైలు లేదా విమానంలో వెళ్లి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సులభంగా లోనావాలా చేరుకోవచ్చు. పుణె నుంచి కేవలం 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

రంగురంగుల పూల ప్రపంచం..వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్:
ఉత్తరాఖండ్‌లోని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రం. జూలై నుంచి సెప్టెంబర్ మధ్య వేలాది రకాల అడవి పూలతో ఈ లోయ రంగుల హరివిల్లుగా మారుతుంది. ప్రకృతి ప్రేమికులు, ట్రెక్కింగ్ అభిమానులకు ఇది స్వర్గధామం లాంటిది. హైదరాబాద్ నుంచి డెహ్రాడూన్ వరకు విమానంలో వెళ్లాలి. అక్కడి నుంచి జోషిమఠ్, గోవిందఘాట్ చేరుకుని ట్రెక్కింగ్ ద్వారా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌కు చేరుకోవాలి. ఈ ప్రయాణం కొంత కష్టమైనదే అయినా, అక్కడి అందాలు జీవితాంతం గుర్తుండిపోతాయి.

అయితే ప్రస్తుతం వర్షాకాలం సీజన్ కావడంతో వాతావరణ పరిస్థితులు తెలుసుకొని ఇక్కడికి వెళ్లాలి. అంతేకాకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular