BJP Focus On Telangana: కర్నాటక తర్వాత దక్షిణాదిన పాగా వేయడానికి అనువైన రాష్ట్రంగా తెలంగాణను ఎంచుకుంది బీజేపీ. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే వ్యూహరచన ప్రారంభించింది. కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ను గద్దె దించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఉత్తర భారత దేశంలో పూర్తి పట్టు సాధించిన బీజేపీ.. ఇప్పుడు దక్షిణ భారతాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలనే దిశగా ముందుకు సాగుతోంది. ఆ నేపథ్యంలోనే తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ కారణంగానే బీజేపీ అధిష్ట్ఠానం తరచూ తెలంగాణకు వస్తూ.. ఒకవైపు పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేస్తూనే మరోవైపు ప్రజా శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఈ నేపథ్యంలోనే దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రూ.7 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ఆయన పర్యటన ముగిసిన కొద్ది రోజులకే కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా తెలంగాణకు రానున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే కీలక సమావేశం ఆర్ఎస్ఎస్ కూడా పార్టీని బలోపేతం చేసే పనులలో దూకుడుగా ఉంది.

19న ప్రధాని.. 28న అమిత్షా..
ఈ నెల 19న రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. తెలంగాణలో అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ ప్రాజెక్టుల విలువ సుమారు రూ7 వేల కోట్లకు పైగా ఉండనుందని అధికారుల మాట. ఇక మోదీ తన పర్యటనలో భాగంగానే వందే భారత్ ట్రైన్ ప్రారంభం, రూ.699 కోట్ల తో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులకు భూమిపూజ చేయనున్నారు. ఇంకా 1,410 కోట్ల వ్యయంతో సికింద్రాబాద్– మహబూబ్నగర్ మధ్య 85 కిలోమీటర్ల డబుల్లై¯Œ జాతికి అంకితం చేయనున్నారు. ఐఐటీ హైదరాబాద్లో రూ.2,597 కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. ఈనెల 28న అమిత్షా కూడా తెలంగాణకు రానున్నారు. రెండు రోజులు రాష్ట్రంలోనే ఉండనున్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, ఎన్నికలకు సన్నద్ధత, వ్యూహరచనపై రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
జనవరి నుంచే మొదలు పెట్టిన షా..
ప్రధాని పర్యటన ముగిసిన 10 రోజులలోపే హోం మంత్రి రాష్ట్రానికి రానున్నారు. పార్టీ సంస్థాగత అంశాలే ప్రధాన అజెండాగా అమిత్ షా టూర్ ఉండబోతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. అంతేకాక పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తూ దిశానిర్దేశం చేస్తారని, సంఘ్ నేతలతోనూ అమిత్షా సమావేశమయ్యే అవకాశం ఉందని సమాచారం. గతేడాది(2022) ఐదుసార్లు తెలంగాణకు వచ్చిన అమిత్ షా, ఈ ఏడాది జనవరి నుంచే తన పర్యటనలను ప్రారంభించారు. పైగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో జాతీయ నేతలు తెలంగాణలో పదేపదే పర్యటిస్తుండటం.. వచ్చే ఎనిమిది నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చు అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.

మిషన్ 90 లక్ష్యంతో..
ఇప్పటికే టార్గెట్ 90 పేరుతో వచ్చే ఎన్నికల్లో 90 సీట్లను గెలవడమే లక్ష్యంగా బీజేపీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో మరింత స్పీడ్ పెంచింది కమలం పార్టీ. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 15 నుంచి అసెంబ్లీ స్థాయి సమావేశాలు, మార్చి 5 నుంచి జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహిస్తామని ఎంపీ లక్ష్మణ్ ఇటీవలే ప్రకటించారు. ఏప్రిల్లో ప్రభుత్వంపై చార్జిషీట్ దాఖలు చేస్తామని, మిషన్ 90తో ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ నిర్ణయించుకుందని వివరించారు.
మొత్తంగా తెలంగాణలో అధికారమే లక్ష్యంగా సమాయత్తం అవుతున్న కమలనాథులు పార్టీని సంస్థాగతంగానూ బలోపేతం చేసేందుకు సైలెంట్గా కార్యచరణ అమలు చేస్తున్నట్లుల రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.