Modi Foreign Tour: ప్రధానిగా నరేంద్రమోదీ మూడోసారి ప్రమాణం చేయబోతున్నారు. జూన్ 9న సాయంత్రం 6 గంటలకు ముహూర్తం నిర్ణయించారు. మోదీతోపాటు కొంతమంది మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. ఈమేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సార్కు దేశాల అధినేతలు హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే.. మూడోసారి ప్రమాణ స్వీకారం తర్వాత మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.
తొలి పర్యటన ఆ దేశానికే..
మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకరారం చేసిన తర్వాత తొలి విదేశీ పర్యటన ఖరారైంది. జూన్ 13 నుంచి 15 వరకు ఆయన జీ7 సమావేశాలకు ఇటలీ వెళ్ళనున్నారు. జీ7 సమావేశాలకు రావాల్సిందిగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని జూన్ 6న మోదీని ఆహ్వానించారు. ఈమేరకు మోదీ ఇటలీ వెళ్లనున్నారు.
మెలోనికి కృతజ్ఞతలు..
వాస్తవానికి భారత్ జీ7లో సభ్య దేశం కాదు. అయినా సమావేశాలకు రావాలని ఇటలీ ఆహ్వానించడంతో మోదీ మెలోనికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితిగతులు, అంతర్జాతీయ వాణిజ్యం, వాతావరణ మార్పులు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్, హమాస్ వార్ తదితర అంశాలపై జీ7 సదస్సులో చర్చించనున్నారు.
జీ7 సభ్యదేశాలు ఇవీ..
జీ7లో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, అమెరికా సభ్యదేశాలు. ఈ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా వెళ్తున్న మోదీ.. అక్కడ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్తో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.