2014లో మోడీ ప్రభంజనం మొదలైనప్పుడు పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. అప్పటి వరకూ యూపీఏపై ప్రజల్లో ఉన్న విసుగు సైతం తోడవడంతో దేశవ్యాప్తంగా కాషాయ పవనాలు జోరుగా వీచాయి. ఇంకా చెప్పాలంటే.. హోరెత్తించాయి. ఈ పరిస్థితి ఐదేళ్లపాటూ కొనసాగింది. ఫలితంగా.. 2019లో అంతకు ముందుకన్నా ఘనంగా కేంద్రంలో కూర్చుంది బీజేపీ. మరి, ఇప్పుడు పరిస్థితి ఏంటీ? కాషాయ పార్టీ ప్రభావం ఎంత? మోడీ వేవ్ బలమెంత? అన్నప్పుడు లెక్కలు వేసుకోవాల్సిన పరిస్థితి.
కేవలం అంబానీ, ఆదానీలకు తప్ప నరేంద్రమోడీ సాధారణ ప్రజలకు చేసిందేమీ లేదన్నది ప్రధాన విమర్శ. ఆదానీ సంపద కేవలం నాలుగేళ్లలోనే ఎన్నో రెట్లు సంపద పెరిగిపోవడం అందరికీ తెలిసిందే. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ సెంటిమెంట్ ప్రయోగించడం తప్ప.. చేసిన భివృద్ది గురించి చెప్పుకొని ఓట్లు అడగడం లేదనే విమర్శ కూడా ఉంది. ఇటు సాధారణ ప్రజల పరిస్థితి చూస్తే.. అన్నింటా ఇబ్బందే ఉంది. గ్యాస్ ధర అమాంతం పెరిగింది. నిత్యావసరాల పరిస్థితి అలాగే ఉంది. పెట్రోల్ వంద దాటేసింది. ఏది చూసుకున్నా ధరలు మోతెక్కిస్తున్నాయి. ఈ కారణాలతో మోడీ ప్రభ మసకబారుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇక, కరోనా సెకండ్ వేవ్ లో కేంద్ర ప్రభుత్వంపై ఏ స్థాయిలో విమర్శలు వచ్చాయో చెప్పాల్సిన పనిలేదు. దేశంలో కరోనా విజృంభిస్తుంటే పట్టించుకోకుండా.. బెంగాల్లో ఎన్నికలపై దృష్టిపెట్టారని, కేంద్రం కేబినెట్ మొత్తం వెళ్లి అక్కడే కూర్చుందనే విమర్శలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ.. చలించకుండా అదే పనిమీద ఉండిపోయింది కేంద్రంలోని బీజేపీ. ఫలితంగా.. దేశంలో కొవిడ్ సృష్టించిన బీభత్సం మాటలకు అందనిది. మోడీ అధికారంలోకి వచ్చిన ఈ ఏడేళ్లలో కార్పొరేట్లు తప్ప.. సామాన్య జనం ఎవ్వరూ సంతోషంగా లేరనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
రాబోయే ఏడాదిలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో.. నాలుగు చోట్ల బీజేపీ అధికారంలో ఉంది. పంజాబ్ లో మాత్రమే కాంగ్రెస్ సర్కారు ఉంది. అయితే.. ఈ నాలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీకి వ్యతిరేక పవనాలే వీస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ బోల్తా కొడితే.. మిగిలింది రాబోయే సార్వత్రిక ఎన్నికలే.. కాబట్టి మోడీకి అంత ఈజీ కాదని అంటున్నారు. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.