కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన హుజూరాబాద్ నేత పాడి కౌశిక్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆయన్ను ఎమ్మెల్సీకి నామినేట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదివారం జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపారు. అనంతరం గవర్నర్ కు సిఫారసు చేశారు. గవర్నర్ కోటాలో నామినేట్ చేయడంతో.. కౌశిక్ రెడ్డి ఎన్నిక లాంఛనం కాబోతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాని భావిస్తున్న కేసీఆర్.. అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్నీ వాడాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే కౌశిక్ కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రాష్ట్ర గవర్నర్ కోటాలో మొత్తం 6 ఎమ్మెల్సీ పదవులు ఉన్నాయి. నాయిని నర్సింహారెడ్డి, రాములు నాయక్, కర్నె ప్రభాకర్ పదవ కాలం ఇప్పటికే ముగిసింది. వారి స్థానంలో గోరేటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్ ను ఎంపిక చేశారు. తాజాగా.. మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పదవీ కాలం జూన్ 16న ముగిసింది. ఈయన స్థానంలోనే కౌశిక్ ను ఎంపిక చేసేందుకు సిఫారసు చేసింది రాష్ట్ర సర్కారు.
సీఎం కేసీఆర్ ఫోకస్ మొత్తం హుజూరాబాద్ పైనే ఉన్నట్టు కనిపిస్తోంది. పదవులతోపాటు వరాలు సైతం ఆ నియోజకవర్గానికే అందిస్తున్నారు. దళిత బంధు పథకాన్ని ప్రకటించిన కేసీఆర్ హుజూరాబాద్ కే పరిమితం చేశారు. ఇప్పుడు కౌశిక్ ను ఎమ్మెల్సీ చేయబోతున్నారు. బండా శ్రీనివాస్ కు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. మొత్తానికి.. అందుబాటులో ఉన్న ప్రతీ అవకాశాన్ని వాడేస్తూ.. హుజూరాబాద్ లో విజయం సాధించాలని చూస్తున్నారు కేసీఆర్.
అయితే.. కౌశిక్ రెడ్డిని హుజూరాబాద్ బరిలో దించుతారనే ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. కానీ.. ఆడియో లీకేజీ వ్యవహారంతో పరిస్థితి మొత్తం మారిపోయింది. ఈ కారణంగానే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చినట్టుగా చర్చ జరుగుతోంది. దీంతో.. ఇప్పుడు ఎవరికి టికెట్ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్వీ నేత గెల్లు శ్రీనివాస్, ఈ మధ్యనే గులాబీ కండువా కప్పుకున్న స్వర్గం రవిలో ఒకరికి టికెట్ ఇవ్వొచ్చని అంటున్నారు. లేదంటే.. టీడీపీ నుంచి కారెక్కిన ఎల్.రమణకు కూడా టిక్కెట్ ఇవ్వొచ్చని అంటున్నారు. వీరేకాకుండా.. ముద్దసాని పురుషోత్తం పేరు కూడా వినిపిస్తోంది. మరి, ఫైనల్ గా ఎవరికి టికెట్ ఇస్తారన్నది చూడాలి.