MLA Roja : వైసీపీ ఎమ్మెల్యే రోజా తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్(CM YS Jagan) పై టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు (Ayyanna patrudu)చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. అయ్యన్న పాత్రుడికి ఎమ్మెల్యే పదవి, ఎంపీ పదవిని పీకేశారని అన్నారు. చంద్రబాబు నాయుడి (Chandra babu) సీఎం పదవిని కూడా పీకేశారని, అడ్డదారిలో మంత్రి అయిన లోకేష్ పదవి కూడా పీకేశారని అన్న రోజా.. స్థానిక ఎన్నికల్లో టీడీపీ జెండానే పీకేశారని, ఇంకా ఏం పీకాలి? అని అన్నారు.
ఈ సందర్భంగానే సినీ ఇండస్ట్రీ గురించి కూడా ఆమె మాట్లాడారు. సినిమా టికెట్లను ప్రభుత్వమే విక్రయిస్తుందంటూ ఏపీ సర్కారు జీవో తెచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఓ కమిటీని కూడా వేసింది. అయితే.. ఈ నిర్ణయంపై ఇండస్ట్రీ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలు పరిష్కరించకుండా.. కొత్త కష్టాలు తెచ్చిపెడుతోందని ఏపీ సర్కారుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సమస్యను ప్రస్తావించిన ఎమ్మెల్యే రోజా.. సంచలన వ్యాఖ్యలు చేశారు.
సినీ ప్రముఖులు కోరితేనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పడం గమనార్హం. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), అక్కినేని నాగార్జున(Nagarjuna) వంటివారు కోరితేనే ప్రభుత్వం ఆన్ లైన్ టికెట్ల అమ్మకం నిర్ణయాన్ని తీసుకుందని చెప్పడం సంచలనం రేకెత్తిస్తోంది.
ఇప్పటికే.. సినిమా టికెట్ రేట్లు తగ్గించడంతో తమకు గిట్టుబాటు కాదంటూ ఎగ్జిబిటర్లు చేతులెత్తేస్తున్నారు. ఈ కారణంగానే.. పెద్ద సినిమాలు కూడా విడుదల కావట్లేదు. ఈ నేపథ్యంలో.. ఎలాగైనా సినిమా టికెట్ రేట్లు పెంచేందుకు ఒప్పించాలని చిత్ర పరిశ్రమ చూస్తుంటే.. ఏకంగా టికెట్ల అమ్మకం మొత్తం తమ చేతుల్లోకి తీసుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరికీ షాక్ కు గురిచేసిందనే వార్తలు వస్తున్నాయి.
టికెట్లను ప్రభుత్వమే విక్రయిస్తే.. ఆ డబ్బులు ఎప్పుడు జమ చేస్తుందో అనే టెన్షన్ ఉంది. ఈ పని చేసినందుకుగానూ కమీషన్ రూపంలో ఎంత తీసుకుంటుంది? అనే కూడా భయం ఉంది. ఆలస్యమైనా, మరో కారణం ఏమైనా.. ఎదురు ప్రశ్నించడానికి ఉండదు. ఇన్ని భయాల నడుమ.. సర్కారు తెచ్చిన ఈ టికెట్ల విక్రయ విధానాన్ని చిత్ర పరిశ్రమ మొత్తం వ్యతిరేకిస్తోందని అంటున్నారు.
అలాంటిది.. ఈ కోరిక ఇండస్ట్రీ పెద్దలే కోరారని రోజా చెప్పడం గమనార్హం. ఇటీవల మంత్రి పేర్ని నాని కూడా ఇదేవిధమైన వ్యాఖ్యలు చేశారు. సినీ ప్రముఖులు కోరితేనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. మరి, నిజంగా వీళ్లే కోరారా? అన్నది తేలాల్సి ఉంది.