ఇప్పటికీ నారా లోకేష్ అంటే.. కేవలం చంద్రబాబు కొడుకు మాత్రమే. ప్రజలతోపాటు తెలుగుదేశం పార్టీలోనూ ఈ అభిప్రాయం ఉంది. రాజకీయాల్లో ఇప్పటి దాకా తనదైన ముద్రవేయలేదు. పార్టీ అధికారంలో ఉంది కాబట్టి.. నేరుగా ఎమ్మెల్సీని చేశారు తండ్రి. కానీ.. ప్రజలు ఆయన్ను మంత్రిని చేయలేదు అనే అపవాదు ఉంది. దీన్ని తుడిచేసుకునేందుకు లోకేష్ ప్రత్యక్ష పోరులోకి దిగారు. కానీ.. బెడిసికొట్టింది. 2019తో మంగళగిరి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆయన ఓటమిపాలయ్యారు. దీంతో.. అప్పటి వరకు ఉన్న విమర్శలకు మరింత బలం చేకూరినట్టైంది.
చంద్రబాబు తర్వాత టీడీపీ బాధ్యతలు తీసుకునే నేతగా ప్రొజెక్ట్ చేస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఆ రేంజ్ మాత్రం పెరగలేదనేది కాదనలేని వాస్తవం. అందుకే.. ఆ పరిస్థితిని నుంచి బయటపడేందుకు లోకేష్ శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక వ్యూహం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. మంగళగిరిలో చేదు అనుభవం ఎదురైన నేపథ్యంలో.. వచ్చేసారి మరింత పకడ్బందీగా బరిలోకి దిగాలని యోచిస్తున్నారు.
ఒకసారి ఓడిపోయారు కాబట్టి.. రెండోసారి ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. అయితే.. ఎక్కడి నుంచి బరిలోకి దిగాలి అన్నది సమస్య. ఎన్నో లెక్కలు వేసుకొని బరిలోకి దిగిన మంగళగిరి నియోజకవర్గంలో దారుణ పరాభవమే ఎదురైంది. అందువల్ల ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గం నుంచి తప్పుకొని, వేరే ప్రాంతాన్ని సెలక్ట్ చేసుకోవాలని చూస్తున్నారట.
ఇందులో భాగంగా రెండు నియోజకవర్గాలను ఎంచుకున్నారని తెలుస్తోంది. ఒకటిపెనమలూరు కాగా.. రెండోది భీమిలి. నిజానికి గత ఎన్నికల్లోనే లోకేష్ భీమిలిని సెలక్ట్ చేసుకోవాలని భావించారు. కానీ.. అనివార్యంగా సబ్బం హరికి కేటాయించాల్సి వచ్చింది. ఇటీవల ఆయన మరణించిన సంగతి తెలిసిందే. దీంతో.. ఆ సీటు ఖాళీ అయ్యింది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే బరిలోకి దిగితే బాగుంటుందని అనుకుంటున్నారట. విశాఖ జిల్లాలో తరచూ పర్యటించడానికి కూడా కారణం ఇదేనని అంటున్నారు. అటు పెనమలూరు కూడా టీడీపీకి బలమున్నదే. సామాజికవర్గం కోణంలోనూ ఇక్కడ పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయి. అందుకే.. ఈ రెండు స్థానాల్లో ఒకటి ఎంచుకోవాలని చూస్తున్నారట. మరి, ఫైనల్ గా దేన్ని సెలక్ట్ చేసుకుంటారనేది చూడాలి.