Taraka Ratna – Lokesh : నారా లోకేష్ యువగళం పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. తారకరత్న మరణంతో వాయిదా వేశారు. తారకరత్న మరణంపై లోకేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నివాళులర్పించేందుకు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకూ అక్కడే గడపనున్నారు. తరువాత తిరిగి వచ్చి పాదయాత్రను ప్రారంభించనున్నారు. లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభంలో పాల్గొన్న తారకరత్న గత నెల 27న అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడారు. శనివారం సాయంత్రం ఆరోగ్యం మరింత క్షీణించడంతో మృతిచెందినట్టు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.
తారకరత్న మరణంతో నందమూరి కుటుంబంలో విషాదం నెలకొంది. అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా విషాదాన్ని వ్యక్తం చేస్తున్నాయి. నందమూరి కుటుంబం నుంచి ఓ యువ కెరటం రాజకీయాల్లోకి వస్తుందనుకుంటే.. ఆయన అకాల మరణాన్ని టీడీపీ శ్రేణులు సైతం జీర్ణించుకోలేకపోతున్నాయి. తారకరత్న మృతదేహాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్ కు ప్రత్యేక వాహనంలో తరలించారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ తో పాటు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తారకరత్న మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
తారకరత్నతో తనది విడదీయరాని బంధమని లోకేష్ పేర్కొన్నారు. బావ అంటూ అప్యాయంగా పిలిచే ఆ గొంతు మూగబోవడం బాధాకరమన్నారు. నేనున్నానంటూ తన వెంట నడిచిన తారకరత్న అడుగులు చప్పుడు ఆగిపోవటం ఆవేదనకు గురి చేస్తోందన్నారు. తారకరతన్న మరణం తమ కుటుంబానికి.. పార్టీకి తీరని లోటుగా పేర్కొన్నారు. ఆయన ప్రేమ..స్నేహబంధం..బంధుత్వం కంటే ఎంతో గొప్పదని లోకేష్ తనకు తారకరత్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
తారకరత్న పార్థివదేహాన్ని మోకిలలోని తన నివాసంలో ఉంచనున్నారు. సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ తెలుగు ఫిలించాంబర్ లో సందర్శకుల సందర్శనార్థం ఉంచనున్నారు. సోమవారం సాయంత్రం మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా వివిధ ప్రాంతాల్లో ఉన్న నందమూరి కుటుంబసభ్యులు తారకరత్న ఇంటికి చేరుకుంటున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More