Homeజాతీయ వార్తలుLok Sabha Elections 2024: తొలి సమరం షురూ.. ప్రారంభమైన సార్వత్రిక పోలింగ్

Lok Sabha Elections 2024: తొలి సమరం షురూ.. ప్రారంభమైన సార్వత్రిక పోలింగ్

Lok Sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా తొలివిడత ఎన్నికలు శుక్రవారం(ఏప్రిల్‌ 19న) ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా 44 రోజులపాటు ఏడు దశల్లో పార్లమెంటు ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. మొదటి విడతలో భాగంగా 102 స్థానాలకు శుక్రవారం పోలింగ్‌ ప్రారంభమైంది. మొత్తం 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరుగుతుంది. తమిళనాడులోని మొత్తం 39 స్థానాలకు మొదటి విడతలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మూడోసారి అధికారంలోకి రావాలని ఎన్డీయే, ఆ కూటమిని ఎలాగైనా గద్దె దించాలని విపక్ష ఇండియా కూటమి గట్టి ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో సార్వత్రిక సమరం ఆసక్తి రేకెత్తిస్తోంది.

16.63 కోట్ల ఓటర్లు..
ఇక తొలి దశ పోలింగ్‌లో శుక్రవారం 16.63 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. తమ అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. వీరిలో 35.67 లక్షల మంది తొలిసారి ఓటువేయబోతున్నారు. 20–29 ఏళ్ల మధ్య వయసువారు 3.51 కోట్లు ఉన్నారు. మొత్తం 1.87 లక్షల పోలింగ్‌ బూత్‌లను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.

బరిలో ఉన్న ప్రముఖులు..
ఇక తొలి విడత ఎన్నికల సమరంలో బీజేపీ నుంచి కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ(నాగ్‌పూర్‌), కిరణ్‌ రిజుజు(అరుణాచల్‌ పశ్చిమం), అన్నామలై(కోయంబత్తూర్‌), తమిళిసై సౌందరరాజన్‌(చెన్నై దక్షిణం), సర్వానంద సోనోవాల్‌(దిబ్రూగఢ్‌), భూపేంద్రయాదవ్‌(అల్వార్‌), జితిన్‌ ప్రసాద్‌(ఫిలిబిత్‌) బరిలోఎ ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి గౌరవ్‌ గొగోయ్‌(జోర్హాట్‌), నకుల్‌నాథ్‌(రింద్వారా), కార్తీ చిదంబరం(శివగంగ)తోపాటు డీఎంకే నాయకురాలు కనిమొళి తదితరుల భవితవ్యాన్ని ఓటర్లు ఈరోజు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.

రెండు రాష్ట్రాల అసెంబ్లీలకు..
లోక్‌సభ ఎన్నికలతోపాటే అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కింలోని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌లో 50, సిక్కింలో 42 స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో 60 స్థానాలు ఉండగా 10 స్థానాలను బీజేపీ ఏకగ్రీవంగా గెలుచుఎకుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version