Heat Waves: ప్రజలకు హెచ్చరిక.. తెలంగాణ అగ్నిగుండం.. ఆ జిల్లాలకు ఆరంజ్‌ అలర్ట్‌!

తెలంగాణలో గురువారం(ఏప్రిల్‌ 18)న రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Written By: Raj Shekar, Updated On : April 19, 2024 9:04 am

Heat Waves

Follow us on

Heat Waves: తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు. నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో రాష్ట్రం అగ్నిగుండాన్ని తలపిస్తోంది. రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే నిప్పుల కొలిమిలా మారుతోంది. తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి. మరో రెండు రోజులు రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాలకు ఆరంజ్, ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ప్రజలు బయటకు రాకుండా ఉండడమే మంచిదని తెలిపింది. తప్పనిసరి రావాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత..
ఇక తెలంగాణలో గురువారం(ఏప్రిల్‌ 18)న రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం, మంచిర్యాల జిల్లా హాజీపూర్‌లో 45.2 డిగ్రీలుగా నమోదైంది. ఏప్రిల్‌ నెలకు సంబంధించి నల్గొండ జిల్లాలో గత పదేళ్లలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత అని తెలుస్తోంది. మరో ఐదు జిల్లాల్లో 44.9 డిగ్రీలు, నాలుగు జిల్లాల్లో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.

17 మండలాల్లో వడగాలులు..
ఇక గురువారం (ఏప్రిల్‌ 17న) రాష్ట్రంలోని 17 మండలాల్లో అడగాలులు వీచాయి. నల్గొండ జిల్లా అనుముల హాలియ, నాంపల్లి, తిరుమలగిరి(సాగర్‌), సూర్యపేట జిల్లా మఠంపల్లి, పాలకేడు, నూతన్‌కల్, మునగాల, వరంగల్‌ జిల్లా ఖిల్లా వరంగల్, దూగొండి, చెన్నారావుపేట, సిద్ధిపేట జిల్లా ధూల్‌మిట్ట, సిద్ధిపేట పట్టణం, భద్రాద్రి జిల్లా సుజాతనగర్, కొత్తగూడెం, చండ్రుగొండ, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చేర్యాల, రేగొండ మండలాల్లో వడగాలులు నమోదయ్యాయి.

రాబోయే రెండు రోజులు మరింతగా..
ఇక ఏప్రిల్‌ 19, 20 తేదీల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరుగతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈమేరకు ఆరంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41–44 మధ్య నమోదవుతాయని తెలిపింది. 21న గద్వాల, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో, 22న ఈ జిల్లాలతోపాటు హైదరాబాద్, కామారెడ్డి, వికారాబాబద్, రంగారెడ్డి, సిరిసిల్ల, పెద్దపల్లి, నిజామాబాద్, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో 40 డిగ్రీలలోపు నమోదయ్యే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. 19, 20, 21 తేదీల్లో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.