ఓబీసీలను గుర్తించే హక్కు తిరిగి రాష్ట్రాలకే కట్టబెడుతూ కేంద్రం ప్రతిపాదించిన రాజ్యాంగ చట్టసవరణ బిల్లును లోక్ సభ ఆమోదించింది. గతంలోనే ఈ బిల్లుకు ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి.
127వ రాజ్యాంగ సవరణ బిల్లు2021ను లోక్ సభలో ప్రవేశపెట్టిన సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి వీరేంద్రకుమార్ మాట్లాడారు. 671 కులాలకు ప్రయోజనం చేకూర్చే చరిత్రాత్మక చట్టంగా పేర్కొన్నారు.
రాష్ట్రాలు తమ పరిధిలోని ఓబీసీ కులాలను గుర్తించే హక్కును పునరుద్ధరించడం ద్వారా ఎన్నో కులాలకు సామాజిక , ఆర్థిక న్యాయం కలిగించవచ్చన్నారు. ఇందుకోసం అధికరణ 342ఏతోపాటు 338బీ, 366ను కూడా సవరించాల్సి ఉందని కేంద్రమంత్రి వీరేంద్రకుమార్ తెలిపారు.
పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన ఓబీసీ బిల్లుకు వైసీపీ మద్దతు తెలిపింది. ఓబీసీ కులాలను గుర్తించే హక్కును తిరిగి రాష్ట్రాలకు కట్టబెడుతూ రాజ్యాంగ సవరణ చేయడాన్ని పూర్తిగా వైసీపీ ఎంపీలు స్వాగతించారు. ఇక టీడీపీ కూడా దీనికి మద్దతిచ్చింది.